స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఈటల రాజేందర్‌కు నోటీసులు?

7 Sep, 2022 10:42 IST|Sakshi
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ శాసనసభ స్మీకర్‌ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మర మనిషిగా పేర్కొంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో  ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా సీఎం చెప్తే చేసే మరమనిషిలా కాకుండా స్పీకర్‌ గతంలో ఉన్న సంప్రదాయాలను కొనసాగించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మంగళవారం అన్నారు. బీఏసీ భేటీకి బీజేపీ సభ్యులను పిలవకపోవడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు.. అసెంబ్లీ మాత్రం శాశ్వతంగా ఉంటుందన్న విషయం మరిచిపోవద్దని హితవు పలికారు. 

‘స్పీకర్‌ మరమనిషిలా పని చేస్తున్నారు. సభా సంప్రదాయాలను మర్చిపోతున్నారు. దీన్ని కాలరాసే అధికారం సీఎంకు లేదు’ అని వ్యాఖ్యా నించారు. ఐదు నిమిషాలు సభ నడిపి ప్రజా సమస్యల నుంచి తప్పించుకున్నా ప్రజాక్షేత్రంలో తప్పించుకోబోరని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 80, 90 రోజులపాటు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 20 రోజులపాటు, వర్షాకాల సమావేశాలు నుంచి 20 రోజుల పాటు జరిగేవని, అలాంటప్పుడు కేవలం ఐదు నిమిషాలు, మూడు రోజుల పాటు జరగడం ఏంటని ప్రశ్నించారు. రఘునందన్‌రావు మాట్లాడుతూ ముగ్గురం ఎమ్మెల్యేలుగా ఉన్న మమ్మల్ని బీఏసీ సమావేశానికి పిలవకపోవడం ఏంటని నిలదీశారు. శాసనసభలో ఏమైనా కొత్త రూల్స్‌ ప్రవేశపెట్టారా? అని అడిగారు.    
చదవండి: రాజాసింగ్‌ బెయిల్‌పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

మరిన్ని వార్తలు