‘గాంధీ’ ఫైల్స్‌ గంటల్లో క్లియర్‌

15 Aug, 2021 04:40 IST|Sakshi
మురుగునీటితో నిండిన సెల్లార్‌లోని డైట్‌ క్యాంటన్‌ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ శర్మన్‌

నిరుపేదలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు 

ఇక్కడి వైద్యుల కోవిడ్‌ సేవలు భేష్‌ 

నూతన కలెక్టర్‌ శర్మన్‌ 

గాంధీ ఆస్పత్రిలోరెండు గంటలపాటు పర్యటన

గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్‌): తెలంగాణ వైద్యప్రదాయిని సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి నిరుపేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తానని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ అన్నారు. శనివారం గాంధీఆస్పత్రిని సందర్శించిన ఆయన సుమారు రెండు గంటల పాటు కలియతిరిగి దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. వైద్యులు, రోగులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా వీక్షించారు.

డ్రైనేజీ, ఫైర్‌ఫైటింగ్‌ సిస్టం, వాటర్‌ లీకింగ్‌తోపాటు ప్రధానమైన సమస్యలను సూపరింటెండెంట్‌ రాజారావు ఆయనకు వివరించారు. 
డ్రైనేజీ పైప్‌లైన్లు పాడైపోవడంతో మురుగునీరు ఆస్పత్రి సెల్లార్‌ను ముంచెత్తుతుందని, సెల్లార్‌లో డైట్‌ క్యాంటిన్, మెడికల్‌ ఫార్మసీ, దోబీఘా ట్, ఫిజియోథెరపీ తదితర సేవలు అందిస్తున్నామని డాక్టర్‌ రాజారావు వివరించారు.  
భవన సముదాయం నిర్మించి 18 ఏళ్లు కావడం తో లీకేజీలతో తరుచు విద్యుత్‌ షార్ట్‌సర్యూ్కట్‌ జరిగి విలువైన వైద్యపరికరాలు మరమ్మత్తులకు గురవుతున్నాయని, గోడలు, పైకప్పులు పెచ్చు లు ఊడి పురాతనభవనాన్ని తలపిస్తుందన్నారు.  
ఫైర్‌ఫైటింగ్‌ సిస్టం కోసం దశాబ్ధకాలంగా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నామని, సీసీ కెమెరాల నిర్వహణ ఫైల్‌ పెండింగ్‌లో ఉందని, ఆస్పత్రి ప్రాంగణంలోని సుమారు 10 దుకాణాలు ప్రైవేటువ్యక్తుల చేతుల్లో ఉన్నాయని, కోర్టును ఆశ్రయించి ఇబ్బంది పెడుతున్నారని. సుమారు రూ.3 కోట్లు బకాయిలు ఉన్నాయని, ఆస్పత్రి తరుపున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ)ని నియమిస్తే కోర్టు వాజ్యాలు పరిష్కారం అవుతాయని కోరారు.  
సుమారు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, రోజుకు 39 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ వినియోగంతోపాటు 650 వెంటిలేటర్‌ పడకలు కలిగిన గాంధీ భవన సముదాయంలో శానిటేషన్, సె క్యూరిటీ, పేషెంట్‌ కేర్‌ టేకర్‌ సిబ్బందిని మరిం త పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు. సంబంధిత ఫైల్స్‌ తీసుకుని తన వద్దకు వస్తే తన పరిధిలో ఉన్న సమస్యలను గంటల వ్యవధిలో పరిష్కరిస్తారనని, మరికొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్తానని కలెక్టర్‌ శర్మన్‌ అన్నారు.  

వైద్యసేవలపై ఆరా...  
పలు విభాగాల్లోని వార్డులను సందర్శించిన కలెక్టర్‌ శర్మన్‌ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి సెల్లార్, డ్రైనేజీ వ్యవస్థ, పంప్‌హౌస్, ఆక్సిజన్‌ ప్లాంట్స్, డైట్‌ క్యాంటీన్‌లను పరిశీలించారు. బ్లాక్‌ ఫంగస్, కోవిడ్‌ వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ శర్మన్‌ కోవిడ్‌ యాంటిజెన్‌ ర్యాపిడ్, ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌లతోపాటు సీటీ స్కానింగ్‌ చేయించుకున్నారు. నిర్ధారణ పరీక్షల్లో కోవిడ్‌ నెగిటివ్‌ వచ్చింది. కార్యక్రమంలో డిప్యూటీలు నర్సింహారావునేత, శోభన్‌బాబు, నోడల్‌ అధికారి ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌ఎంఓ–1 నరేందర్‌కుమార్, ఆఫీస్, నర్సింగ్‌ సూపరింటెండెంట్లు విజయ్‌భాస్కర్, మంగమ్మలతోపాటు వైద్యులు, సిబ్బంది, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు