‘సింగరేణి’ నియామకాలకు ఓకే

22 Sep, 2023 02:56 IST|Sakshi

జూనియర్‌ అసిస్టెంట్ల నియామక ప్రక్రియకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ 

అయితే తుది తీర్పునకు లోబడి నియామకాలు ఉంటాయన్న ధర్మాసనం 

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు ఊరటనిచ్చింది. గత సంవత్సరం నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 పరీక్ష ఫలితాలను వెల్లడించి, నియామక ప్రక్రియ చేపట్టవచ్చని చెప్పింది. అభ్యర్థులను ఎంపిక చేయ వచ్చని చెబుతూ.. తుది ఉత్తర్వుల మేరకే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. సింగరేణి వ్యాప్తంగా 177 జూని యర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 పోస్టులను భర్తీ చేసేందుకు 2022 లో సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్‌ ఇచ్చింది. దాదాపు 98,882 మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

2022, సెప్టెంబర్‌ 4న రాష్ట్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంతో పాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్‌లో నిర్వహించిన పరీక్షకు 79, 898 మంది హాజరయ్యారు. ఆ తర్వాత సింగరేణి యాజమాన్యం ‘కీ’ని విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో పరీక్ష సందర్భంగా మాస్‌ కాపీయింగ్, ఇతర అవ కతవకలు జరిగాయంటూ రామగుండంకు చెందిన అభిలాష్‌ సహా పలువురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 పరీక్షను రద్దు చేశారు.

నిర్వహణలో పలు అవకతవకల కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తేల్చిచెప్పారు. కాగా, ఈ తీర్పును సవాల్‌ చేస్తూ పరీ క్ష రాసిన పలువురు అభ్యర్థులు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలీ, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

సింగరేణి తరఫున స్పెషల్‌ జీపీ ఎ.సంజీవ్‌కుమా ర్‌ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ని యామక ప్రక్రియకు అనుమతించింది. తుది ఉత్తర్వుల మేరకే నియామకాలు ఉంటాయని చెబుతూ విచారణను వాయిదా వేసింది. కాగా, కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు సింగరేణి డైరెక్టర్‌ ఫైనాన్స్‌ అండ్‌ పర్సనల్‌ ఎన్‌.బలరామ్‌ తెలిపారు. త్వరలోనే నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు