హెచ్ఎండీఏలో బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి ఐఏఎస్‌

15 Dec, 2023 20:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డ్యాషింగ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా పేరున్న ఆమ్రపాలి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ జాయింట్‌ కమిషనర్‌గా ఇవాళ సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. బదిలీ ద్వారా పదోన్నతితో హెచ్‌ఎండీఏకు ఆమె నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆమెను అభినందించారు.  

హెచ్ఎండిఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ప్రభుత్వం తనకు కల్పించిందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఆపై మూసి రివర్ ఫ్రెంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టి కార్పొరేషన్ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యారు.

హెచ్‌ఎండీఏకు ఉన్నత పరిపాలనాధికారిగా కమిషనర్‌ మాత్రమే కొనసాగుతుండగా.. తాజాగా సంయుక్త కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.  2019 నుంచి హెచ్‌ఎండీఏకు కమిషనర్‌గా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ కొనసాగుతున్నారు. హెచ్‌ఎండీఏను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో అర్వింద్‌ను హెచ్‌ఎండీఏలో కొనసాగిస్తారా.. ఆ స్థానంలో నూతన అధికారిని నియమించనున్నారా? అనే దానిపైనా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు