రైతుల గురించి సెలబ్రిటీల మాటలు బాధాకరం: జగ్గారెడ్డి 

6 Feb, 2021 08:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్, రవిశాస్త్రి, సినీ తారలు కంగనా, అజయ్‌ దేవగన్, అక్షయ్‌కుమార్‌ లాంటి వారు ఒక్కసారి నాగలి పట్టి, భూమి దున్ని, ఇత్తులేసి, నీరు పోసి, పంట పండించగలరా? నాగలి పట్టి, పొలం దున్ని, పంట పండించడం అంటే క్రికెట్‌ ఆడినంత ఈజీ కాదు.. సినిమాల్లో డైలాగ్‌ చెప్పి డాన్స్‌ చేసినంత సులువు కాదు. రైతుల గురించి, వారు చేస్తున్న ఉద్యమాల గురించి అవమానకరంగా మాట్లాడడం మానుకోవాలి’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి హితవు పలికారు.

రైతులు పండించిన పంట తింటూ వారి పోరాటాన్నే వ్యతిరేకిస్తూ కొందరు సినీ తారలు, క్రికెట్‌ ప్లేయర్లు మూర్ఖంగా మాట్లాడటం బాధాకరమని శుక్రవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘సినీ పరిశ్రమలో, క్రికెట్‌ ఆటలో విరామం ఉంటుంది. వారు ఆడుతున్నా, నటిస్తున్నా చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తారు. కానీ రైతులు నాగలి పట్టి భూమి దున్నేటప్పుడు అలాంటిదేమీ ఉండదు. రైతులకు పరాయి దేశస్తులు మద్దతిస్తే దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన సెలబ్రిటీలు విమర్శలు చేయడం సిగ్గుచేటు’అని దుయ్యబట్టారు.
 

మరిన్ని వార్తలు