ప్రాజెక్టులపై కయ్యం

11 Aug, 2020 01:24 IST|Sakshi

కేంద్రానిదీ తప్పుడు విధానమే: సీఎం కేసీఆర్‌ మండిపాటు

అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో వారి వాదనలను తిప్పికొడతాం

తెలంగాణ నీటి వాటా మేరకే రాష్ట్రంలో ప్రాజెక్టులు

గతంలోనే అనుమతులొచ్చిన ప్రాజెక్టులపై అభ్యంతరాలా?

 తెలంగాణ అవసరాల మేరకే కొన్నింటిని రీ డిజైన్‌ చేశాం

సాగర్‌కు నీటివిడుదలపై కేంద్రం అభ్యంతరం సమంజసం కాదు

కేంద్రం వైఖరినీ యావత్‌ దేశానికి తెలిసేలా చేస్తాం

 జలవనరులశాఖ అధికారులతో సమీక్షలో సీఎం వ్యాఖ్యలు

అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో సమర్థంగా వాదించాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని.. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంబిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నా అంతట నేనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహహస్తం అందించాం. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహపూర్వకంగా మెలిగి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలుచేద్దామని చెప్పాం.

అయినా సరే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థంలేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోంది. అపెక్స్‌ కమిటీ సమావేశంలో ఆం«ద్రప్రదేశ్‌ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థరహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెబుతాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కల్పిస్తాం’అని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు సోమవారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రం, ఏపీ అభిప్రాయాలపై చర్చించారు.

కేంద్రానిది కూడా తప్పే.. 
‘తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పే. తెలంగాణ రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదు’అని సీఎం అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందు పెట్టి సమర్థవంతంగా వాదనలను వినిపించాలని నిర్ణయించారు. ‘శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరపెడుతోంది. వాస్తవానికి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నింపిన తర్వాతే మిగిలిన ప్రాజెక్టులు నింపాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదు. అది జలవిద్యుత్‌ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదు. ఈ విషయంలో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్ర వైఖరిని కూడా యావత్‌ దేశానికి తెలిసేలా చేస్తాం’అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

రాష్ట్ర హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు..
‘గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వాటికి నీటి కేటాయింపులు కూడా జరిగాయి. సీడబ్ల్యూసీ సహా ఇతర సంస్థల నుంచి అనుమతులు వచ్చాయి. దాదాపు రూ.23వేల కోట్ల మేర నిధుల ఖర్చు చేశారు. 31,500 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వీటిని కొత్త ప్రాజెక్టులు అనడం అర్థరహితం, అవివేకం. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మంజూరైనప్పటికీ వాటిని పూర్తిచేయలేదు. పైగా తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారు. దీనివల్ల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీరవు. చాలా ప్రాజెక్టుల డిజైన్‌ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా చేయలేదు. అందువల్ల తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికున్న హక్కులు, అవసరాలు, నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు రీ డిజైన్‌ చేసి నిర్మిస్తున్నాం. దీన్ని తప్పుబట్టడంలో అర్థంలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నీటి కేటాయింపులు జరిపి, ప్రతిపాదించిన ప్రాజెక్టులు కట్టడంలేదనే అసంతృప్తితోనే, నీటి పారుదల రంగంలో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది’అని కేసీఆర్‌ వివరించారు.

అవన్నీ రీ డిజైన్‌ చేసిన ప్రాజెక్టులు..    
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్‌ చేసి కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టును రీ డిజైన్‌ చేసి సమ్మక్క సాగర్, రాజీవ్‌సాగర్‌–ఇందిరాసాగర్‌ ప్రాజెక్టులను రీ డిజైన్‌ చేసి సీతారామ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టును రీ డిజైన్‌ చేసి సీతమ్మసాగర్‌ నిర్మిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. పెన్‌గంగ ప్రాజెక్టులకు 1975లోనే ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఏఏ అనుమతులు సాధించారు? తెలంగాణ వచ్చేనాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? విడుదల చేసిన జీవోలు.. తదితర వాస్తవాలను అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా బహిరంగ పరిచి ఫిర్యాదులు చేసినవారికి, సందేహాలు వెలిబుచ్చినవారికి తిరుగులేని సమాధానం చెప్పాలని అధికారులను ఆదేశించారు. ‘గతంలో జరిగిన మొదటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని ప్రస్తావించింది. దీంతో ఈ రెండింటినీ కొనసాగించాలని నిర్ణయించారు. మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడం సరికాదు. పాలమూరు–రంగారెడ్డి విషయంలో కూడా వాస్తవాలను మరోసారి వివరిస్తాం’అని సీఎం పేర్కొన్నారు. మంచినీటి అవసరాల కోసం వాడే నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ట్రిబ్యునల్‌ చెప్పిందని, దాని ప్రకారం తెలంగాణ మంచినీటి కోసం వాడే 110 టీఎంసీల్లో 22 టీఎంసీలను మాత్రమే లెక్కకు తీసుకోవాలని స్పష్టంచేశారు.

సాగునీటిలో తెలంగాణకు అంతులేని అన్యాయం...
‘సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరిగింది. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును 17 కిలోమీటర్ల దిగువన కట్టడం వల్ల అన్యాయం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన కారణంగా ఎగువ కృష్ణ, తుంగభద్ర, బీమా ప్రాజెక్టులు పోయాయి. నీటివాటాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని సాక్షాత్తూ బచావత్‌ ట్రిబ్యునల్‌ పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తన నీటి వాటాను అడిగే సందర్భంలో తెలంగాణను పరిగణనలోకి తీసుకోలేదని స్వయంగా ట్రిబ్యునల్‌ గ్రహించి, తెలంగాణకు ప్రత్యేకంగా నీటిని కేటాయించింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన జూరాలతో పాటు నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయల్‌సాగర్‌ వంటి ప్రాజెక్టులను తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి చేసుకోగలిగాం.

ఆర్డీఎస్‌ తూములను ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పేల్చితే.. గ్రావిటీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాలేదు. ఆర్డీఎస్‌ ఆయకట్టును స్థిరీకరించడానికి ఎంతో వ్యయం చేసి తుమ్మిళ్ల లిఫ్టు నిర్మించుకోవాల్సి వచ్చింది. ఇలా సాగునీటి రంగంలో అంతులేని అన్యాయం జరిగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు దక్కిన నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. వాస్తవానికి ఇంకా తెలంగాణకు నీటి అవసరం ఉంది. గోదావరి మిగులు జలాల్లో మరో వెయ్యి టీఎంసీలు దక్కాల్సి ఉంది. గోదావరికి తెలంగాణలోనే క్యాచ్‌మెంటు ఏరియా ఎక్కువ. నది ప్రవహించేది తెలంగాణలోనే ఎక్కువ. రాష్ట్రానికి అవసరాలు కూడా ఉన్నాయి. సముద్రంలో కలిసే 2వేల టీఎంసీలలో తెలంగాణకు కనీసం వెయ్యి టీఎంసీలు కేటాయించాలి’అని సీఎం కేసీఆర్‌ కేంద్రాన్ని కోరారు. 

మరిన్ని వార్తలు