ఇస్రోలో ఉద్యోగం సాధించిన ఇల్లెందు వాసి..

22 Aug, 2021 08:53 IST|Sakshi
సాయిపవన్‌తేజ్‌ను అభినందిస్తున్న దృశ్యం

సాక్షి, ఇల్లెందు(ఖమ్మం): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో పట్టణానికి చెందిన కోట సాయిపవన్‌తేజ్‌ ఉద్యోగం సాధించాడు. గ్రూప్‌–1 గెజిటెడ్‌ స్థాయి కలిగిన శాస్త్రవేత్తగా అతడు ఉద్యోగం సాధించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సాయిపవన్‌తేజ్‌కు చిన్నతనం నుంచే చదువు మీద మక్కువ. తల్లిదండ్రులు కోట విజయ్‌కిశోర్‌బాబు, లావణ్య పవన్‌తేజ్‌ పదో తరగతిలో ఉన్నప్పుడే అగ్నిప్రమాదంలో మృతిచెందారు. అయినా పట్టుదలతో చదివాడు.

ఇంటర్‌ అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆలిండియా స్థాయిలో 502 ర్యాంకు సాధించాడు. ఓబీసీ కేటగిరీలో 59వ ర్యాంకు సాధించి ఢిల్లీ ఐఐటీలో సీటు సాధించాడు. 2021లో ఇంజనీరింగ్‌లో 82 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు. ఈ ఏడాదిలోనే ఇస్రో వారు ఢిల్లీ ఐఐటీలో క్యాంపస్‌ సెలక్షన్స్‌ నిర్వహించగా సాయిపవన్‌తేజ్‌ సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌–1 గెజిటెడ్‌ పోస్టుకు ఎంపికయ్యాడు.

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ (గగన్యన్‌ ప్రాజెక్టు)కు ఎంపికయ్యాడు. కాగా, శనివారం తన క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయిపవన్‌తేజ్‌ను ఎమ్మెల్యే హరిప్రియతోపాటు మున్సిపల్‌ చైర్మన్‌ డీవీ, విద్యాబోధన చేసిన ఎంసీ నాగిరెడ్డి, కేఎస్‌వీ సుధాకర్, శ్రీను, అర్వపల్లి రాధాకృష్ణ, ప్రసాద్‌ అభినందించారు. 

చదవండి: పాపికొండలు.. బెంగాల్‌ పులులు.. బంగారు బల్లులు

చదవండి: భార్య కాపురానికి రావడం లేదని టవర్‌ ఎక్కిన భర్త

మరిన్ని వార్తలు