మహబూబాబాద్‌ జిల్లా కోర్టు సంచలన తీర్పు.. దీక్షిత్‌ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధింపు

29 Sep, 2023 13:21 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల కిత్రం జరిగిన బాలుడి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మందసాగర్‌కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది,

కాగా 2020 అక్టోబర్‌18న మహబూబాబాద్‌కు చెందిన కుసుమ వసంత, రంజిత్‌ రెడ్డి దంపతుల కుమారుడు దీక్షిత్‌ రెడ్డిని మందసాగర్‌ డబ్బుల కోసం కిడ్నాప్‌ చేశాడు. అక్కడి నుంచి కేసముద్రం మండలం అన్నారం శివారులో ఉన్న ధానమయ్య గుట్టపై తీసుకెళ్లా.. బాలుడిని హతమార్చి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అనంతరం అదే రోజు రాత్రి దీక్షిత్ తండ్రికి ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే బాలుడిని వదిలేస్తానని చెప్పాడు. పోలీసులకు దొరక్కుండా ఇంటర్నెట్ కాల్స్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేశాడు.

ఇది జరిగిన మూడురోజుల అనంతరం తాళ్లపూసపల్లి సమీపంలో ఉన్న ధానమయ్య గుట్టలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. అప్పట్లో ఈ ఘటన ఉదంతం కలకలం రేపింది. అప్పటి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి శనిగపురంకు చెందిన పంక్చర్ షాప్ నిర్వహుకుడు మంద సాగర్ నిందితుడిగా తేల్చారు పోలీసులు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేసినట్లు తేలింది. మళ్లీ దొరికిపోతామన్న భయంతోనే దీక్షిత్‌ను చంపినట్లు పోలీసులు తేల్చారు.

ఈ కేసులో అరెస్టైన సాగర్ ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్షననుభవిస్తున్నాడు.. మూడేళ్లుగా సాగిన విచారణలో తాజాగా ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
చదవండి: హైదరాబాద్‌ గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఇద్దరు మృతి

మరిన్ని వార్తలు