-

Medaram Jatara 2022: మేడారం జాతరలో ఆసక్తికర సన్నివేశం.. ‘పంచాయితీ’ పెట్టే మంత్రిని కాను..

19 Feb, 2022 07:49 IST|Sakshi

సమన్వయం చేస్తూ.. సలహాలిస్తూ..

జాతరలో అన్నీ తానైన మంత్రి ఎర్రబెల్లి 

సాక్షి, వరంగల్‌: మేడారం మహా జాతరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నీ తానై వ్యవహరించారు. అధికారులను ఎక్కడికక్కడ సమన్వయపరుస్తూ.. సలహాలు ఇస్తూ జాతర సజావుగా సాగేందుకు తనదైన తీరును ప్రదర్శించారు. జాతరకు వచ్చే భక్తులు, వీఐపీలు, వీవీఐపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఎదురెళ్లి అమ్మవారి దర్శనం చేయించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి, మంచెపై నుంచి జాతర తీరును పరిశీలిస్తూ.. మైకులో అధికారులకు తగిన ఆదేశాలిచ్చారు. భక్తులు క్యూ పద్ధతి పాటించాలని, బంగారం, కొబ్బరి కాయలు విసిరేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. కాగా.. సీఎం కేసీఆర్‌ రాక కోసం ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌తో కలిసి మంత్రి రెండు రోజులపాటు హెలిపాడ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించగా.. చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్దయింది. 
చదవండి: వనదేవతలకు జన హారతి 

‘పంచాయితీ’ పెట్టే మంత్రిని కాను..
జాతరకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్‌ మీడియా పాయింట్‌ నుంచి ఎదురుపడిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి ఎరబ్రెల్లి ఎదురుపడగానే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రేణుక సింగ్‌కు ఎరబ్రెల్లిని పరిచయం చేస్తూ.. తెలంగాణలో గట్టి మంత్రి అంటూ.. చేతులతో గట్టి అనే అర్థం స్ఫురించేలా ఊపారు. అలాగే పంచాయతీ మంత్రి అంటూ కిషన్‌రెడ్డి చెప్పగానే.. మంత్రి ఎరబ్రెల్లి స్పందిస్తూ.. పంచాయితీలు పెట్టే మంత్రిని కాను, పరిష్కరించే మంత్రిని అని రేణుక సింగ్‌తో అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి.
చదవండి: మేడారానికి జాతీయ హోదా.. కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తలసాని కౌంటర్‌

మరిన్ని వార్తలు