Minister KTR: 'దమ్ముంటే నా మీద కేసులు పెట‍్టండి.. చిన్నా చితక అధికారులను బెదిరించొద్దు'

21 Jun, 2022 14:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో అగ్నిపథ్‌ అనే పథకాన్ని తీసుకొచ్చి యువత కడుపు కొడుతున్నారని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఆవేదనతో వారు ఆందోళన చేస్తుంటే వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో నూతనంగా అందుబాటులోకి వచ్చిన కైతలాపూర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. మొత్తం రూ.86 కోట్లతో ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో హైటెక్‌ సిటీ ఉద్యోగులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. ఇది హైదరాబాద్‌ 30వ ఫ్లైఓవర్‌ అని మంత్రి కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

ఇంకో 17 ఫ్లైఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయని ఈ ఏడాదిలో మరో 6 అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఐడీపీఎల్‌ నుంచి రోడ్లు వేస్తుంటే కేసులు పెట్టమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారంట. కిషన్ రెడ్డికి దమ్ముంటే మున్సిపల్ మంత్రినైన నా మీద కేసు పెట్టండి. చిన్నా చితక అధికారులను బెదిరించొద్దు. మీకు చేతనైతే రోడ్లు, ఫ్లై ఓవర్లు కట్టండి అంతే కాని అభివృద్ధి అడ్డుకోకండిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కేటీఆర్‌ కోరారు.

చదవండి: (తెలంగాణకు పట్టణ కళ)

కిషన్ రెడ్డి మోదీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉండి అగ్నిపథ్‌లో చేరితే డ్రైవర్లు, బట్టలు ఉతికే స్కిల్స్ వస్తాయి అంటున్నారు. ఈ మాత్రం దానికి దేశ యువత మిలిటరీలో చేరాలా అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు. 'బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హైదరాబాద్‌ వస్తారు అని అంటున్నారు. ఏ మొహం పెట్టుకుని హైదరాబాద్‌కు వస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా వేల కోట్ల రూపాయల పనులు శంకుస్థాపన చేశారని చెప్తారు అందులో ఎంత నిజముందో తెలియదు. హైదరాబాద్‌కు టూరిస్టులు వస్తారు పోతారు. మన కేసీఆర్‌ ఇక్కడే ఉంటారు. వచ్చే టూరిస్టులు ఏం తెచ్చారో ఏం ఇచ్చారో చెప్పాలని' మంత్రి కేటీఆర్‌ కోరారు. 

మరిన్ని వార్తలు