పాఠశాల విద్యార్థుల కథలు చరిత్రకు శ్రీకారం

27 Sep, 2023 02:10 IST|Sakshi

‘మన ఊరు మన చెట్టు’ పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి సబిత 

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా ఒకేరోజు.. ఒకే సమయానికి 5 లక్షల మంది పాఠశాల విద్యార్థులు ‘మన ఊరు మన చెట్టు’అనే అంశంపై కథలు రాసి నూతన చరిత్రకు శ్రీకారం చుట్టారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. మంగళవారం బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో సబిత ‘మన ఊరు మన చెట్టు’పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ తరహా ప్రయత్నం దేశ చరిత్రలోనే తొలిసారి కావడం గొప్ప విషయమని, రాష్ట్ర విద్యార్థులు కలం పట్టి తమ ఊరి ప్రకృతిని అద్భుత కథలుగా మలచి దేశానికే మోడల్‌గా నిలిచారని కొనియాడారు.

33 జిల్లాలకు చెందిన విద్యార్థులు రాసిన కథలను 33 పుస్తకాలుగా తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించి విద్యార్థులకు అందించడం అభినందించదగిన విషయమన్నారు. బాల సాహిత్య విస్తృతికి కృషి చేయడమే కాకుండా రాష్ట్రంలో పుస్తక ప్రదర్శనలతో జ్ఞాన తెలంగాణ కోసం కృషి చేస్తున్న సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ను మంత్రి సబిత శాలువాతో సన్మానించారు.

కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి నామోజు, తెలంగాణ విద్యా మౌలికవసతుల సంస్థ చైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి, ప్రొ. నారా కిశోర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆరీ్టయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డి. శ్రీపాల్‌రెడ్డి, బి. కమలాకర్‌రావు పాల్గొన్నారు.  

దసరా నుంచి స్కూల్‌ విద్యార్థులకు అల్పాహారం 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దసరా పండుగ నుంచి ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’అమలు చేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యారి్థనీ విద్యార్థులకు దసరా పండుగ రోజు నుంచి ఉచిత అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పథకం అమలు తీరుతెన్నులపై ఆమె మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. పథకానికి సంబంధించిన మెనూను త్వరగా నిర్ణయించాలని, విధివిధానాలు రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు. 

మరిన్ని వార్తలు