ఉన్నత విద్యాసంస్థల్లో అసాంఘిక చర్యలపై ఉక్కుపాదం

23 Dec, 2022 02:42 IST|Sakshi
సమావేశంలో మంత్రి సబిత. చిత్రంలో నవీన్‌ మిత్తల్, ఆర్‌.లింబాద్రి, మహేంద్‌రెడ్డి తదితరులు

విద్య, పోలీసు శాఖల సమావేశంలో నిర్ణయం  

త్వరలో కఠినచట్టాలకు రూపకల్పన 

వర్సిటీల్లో స్వేచ్ఛాయుత పోలీసింగ్‌కు అడుగులు 

సాక్షి, హైదరాబాద్‌: సరికొత్త చట్టాలు, అధునాతన సాంకేతికత సహాయంతో ఉన్నత విద్యాసంస్థల్లో అసాంఘిక చర్యలపై ఉక్కుపాదం మోపాలని ఉన్న త విద్యా, పోలీసుశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికిగాను ప్రస్తుత చట్టాలను మరింత కఠినతరం చేయాలని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యామండలి నేతృత్వంలో గురువారం ఇక్కడ ‘విద్యాసంస్థల్లో భద్రతాచర్యలు, రక్షణ విధానం’అనే అంశంపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది.

యూనివర్సిటీలు, కాలేజీల్లో మాదవద్రవ్యాలు, సైబర్‌ నేరాలు, వివక్ష, వేధింపుల నియంత్రణ సవాల్‌గా మారిందని పోలీసు అధికారులు చెప్పినట్లు తెలిసింది. విద్యాసంస్థల్లోకి పోలీసుల ప్రవేశాన్ని అడ్డుకునే చట్టాలను మార్చాలని, స్వేచ్ఛగా ప్రవేశించి, ఏ కేసునైనా శోధించే వీలు కల్పించాలని, నిఘా వ్యవస్థ కోసం పటిష్టమైన చర్యలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని పోలీ సు అధికారులు అభిప్రాయపడ్డారు.

సీసీ కెమెరా లు, కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని పలువురు సూచించగా వీటన్నింటికీ నిధుల సమ స్య ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిసింది. అంతిమంగా పోలీసు, విద్యాశాఖ కలిసి పనిచేయాలని, ఈ దిశగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయాలని నిర్ణయించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్, మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ వి.వెంకటరమణ, డీజీపీ మహేందర్‌ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు సీవీ ఆనంద్, మహేశ్‌ భగవత్, స్వాతి లక్రా, సుమతి తదితరులు పాల్గొన్నారు.  

భద్రత ముఖ్యమే: లింబాద్రి 
సమావేశం అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొ.లింబాద్రి మీడియాతో మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యాసంస్థల్లో భద్రత కీలకమైన అంశమని, దీని కోసం పోలీసు లు, విద్యాశాఖ సమన్వయంతో ముందుకువెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులుండే వర్సిటీ క్యాంపస్‌ల్లో డ్రగ్స్, సైబర్‌ నేరాలను అరికట్టడం వంటి విషయాలపై అవగాహనకు సరికొత్త విధానాలు అనుసరించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

కొత్తగా కాలేజీల్లోకి అడుగుపెట్టే వారిలో న్యూనతాభావం తొలగించేందుకు, ఒత్తిడికి లోనవ్వకుండా కౌన్సెలింగ్‌ కేంద్రాల ఏర్పాటు అవసరంపై చర్చించనట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు వెలువడే వీలుందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడే క్రమంలో వాటిని వినియోగించే విద్యార్థులను నేరస్తులుగా చూడబోమన్నారు.  

గవర్నర్‌ ఆమోదించగానే ఖాళీల భర్తీ: మంత్రి సబిత  
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసెంబ్లీ ఆమోదం     పొంది, గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న విద్యాశాఖ బిల్లులపై అనుమానాలను నివృత్తి చేశానని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి స్పష్టం చేశారు. ఆమె గురువారం బషీర్‌బాగ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. కొంత కాలంగా గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఆమోదం లభించిన వెంటనే వర్సిటీల్లోని ఖాళీ లను భర్తీ చేస్తామని చెప్పారు.

బిల్లులను గవర్నర్‌ ఎందుకు ఆమోదించడం లేదో తనకు తెలియ ద ని పేర్కొన్నారు. కరోనా కాలంలో తెలంగాణ లోనే ఉన్న చంద్రబాబు ఒక్కసారైనా ఇక్కడి ప్రజలను కలిసే ప్రయత్నం చేయలేదని ఆమె వి మర్శించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రజలపై  మొసలికన్నీరు కారుస్తున్నారని   విమర్శించారు.   

మరిన్ని వార్తలు