కన్న కొడుకును ‘అమ్మే’సింది!

12 Aug, 2020 07:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నాంపల్లి: పచ్చనోట్లకు అమ్మ ప్రేమ అమ్ముడైపోయింది... పేగు బంధాన్ని మరిచి డబ్బు కోసం కన్న కొడుకును అమ్మేసింది... రెండు నెలల పసికందును తల్లి విక్రయించిన ఘటన  హబీబ్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  స్థానిక సుబాన్‌పురాకు చెందిన అబ్దుల్‌ జోయాఖాన్, అబ్దుల్‌ ముజాహిద్‌ భార్యాభర్తలు.  వీరికి షేక్‌ అద్నాన్‌ (2 నెలలు) కుమారుడు ఉన్నాడు. భర్త ఎర్రమంజిల్‌ కాలనీలోని  ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ముజాహిద్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.

దంపతులిద్దరూ మద్యం తాగి తరచు గొడవ పడేవారు. భార్యతో గొడవపడ్డ భర్త ఈ నెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లి 8వ తేదీన తిరిగి వచ్చాడు. ఇంట్లో కుమారుడు అద్నాన్‌ కనిపించలేదు. దీంతో   కుమారుడు ఎక్కడని భార్యను నిలదీయగా  అమ్మేశానని చెప్పింది. దీంతో భార్యపై భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆగాపురాకు చెందిన షేక్‌ మహ్మద్, తబుసుమ్‌ బేగం అనే దంపతుల ద్వారా కాలాపత్తర్‌కు చెందిన సిరాజ్‌ అనే మహిళకు రూ.45 వేలకు బాలుడ్ని విక్రయించినట్టు  పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు బాబును విక్రయించిన తల్లిని, కొనుగోలు చేసిన మహిళతో పాటుగా వీరిద్దరి మధ్య బేరం కుదిర్చిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

మరిన్ని వార్తలు