ప్రతి ముగ్గురిలో ఒకరికి కొలెస్ట్రాల్‌..

30 Jun, 2022 02:11 IST|Sakshi

18 ఏళ్లుపైబడిన 4,05,988 మందికి వైద్య పరీక్షలు

బ్లడ్‌ గ్రూప్‌ మొదలు మొత్తం 30 రకాల టెస్టులు

27,985 మందిలో కొలెస్ట్రాల్‌ సమస్య.. 10,186 మందిలో మధుమేహం

ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం ఆన్‌లైన్‌లో నిక్షిప్తం

ఒక్క క్లిక్‌ చేస్తే హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రత్యక్షం

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వంద మందిలో 33 మంది అనారోగ్యంతో ఉన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ–హెల్త్‌ ప్రొఫైల్‌ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోనే మొదటిసారిగా సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రయోగా త్మకంగా చేపట్టిన ఈ–హెల్త్‌ ప్రొఫైల్స్‌ సిద్ధమవుతున్నాయి. ఆరోగ్య సర్వేలు ఇంటింటా సాగుతూ ముగింపు దశ (96%)కు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మార్చి 5న మంత్రి కె.తారక రామారావు, ములు గులో మంత్రి టి.హరీశ్‌రావు  పైలట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 

ఇంటింటా సర్వేలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 203 ఆరోగ్య కార్యకర్తల బృందాలు ఇంటింటా సర్వేలు చేస్తున్నాయి. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ సుమారు 30 రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తు న్నారు. ఇప్పటికి 4,05,988 మందికి టెస్టులు పూర్తయ్యా యి. బ్లడ్‌గ్రూప్, రక్తహీనత, కిడ్నీ, షుగర్, కాల్షియం, కొలెస్ట్రాల్, కాలేయం, ఇతర పరీక్షలను సిరిసిల్లలోని తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఎత్తు, బరువు వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను ‘డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌’ రూపంలో భద్రపరుస్తున్నారు. ఈ సమాచారంతో ఆధార్‌ కార్డు నంబరు, మొబైల్‌ నంబరుతో అనుసంధానం చేసి పేరు, పుట్టిన తేదీ, యూనిక్‌ కోడ్, ఎమర్జెన్సీ ఫోన్‌ నంబర్‌ వంటి వివరాలు కార్డులో పొందుపరుస్తు న్నారు. యూనిక్‌ బార్‌కోడ్‌ను స్కాన్‌ చేస్తే.. చాలు సదరు వ్యక్తి సమగ్ర సమాచారం కళ్ల ముందు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయడమే ఈ–హెల్త్‌ ప్రొఫైల్‌ లక్ష్యం.  

ఆధునిక పరిజ్ఞానంతో పరీక్షలు
టీ–డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నమూనాలను విశ్లేషిస్తున్నారు. రోజుకు సగటున ఆరు వేల రక్త నమూనాలను పరీక్షిస్తూ.. ఆ వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేస్తున్నారు. ఈ మూడు నెలల్లో ఒకరోజు గరిష్టంగా 14,690 రక్తపరీక్షలు చేయగా.. ఇప్పుడు సగటున 400 నుంచి 600 శాంపిళ్లు పరీక్షిస్తు న్నారు. ఇప్పటివరకు పూర్తయిన పరీక్షల్లో ఎక్కువ మందిలో కొలెస్ట్రాల్‌ సమస్య బయట పడగా, ఆ తర్వాత స్థానంలో కాల్షియం సమస్య ఉంది. థైరాయిడ్‌ సమ స్యతో 17,001 మంది, కాలేయ సమస్యతో 15,839 మంది, మూత్రపిం డాల సమస్యతో 14,267 మంది, మధుమేహంతో 10,186 మంది ఉన్నట్టు గుర్తించారు. 

మరిన్ని వార్తలు