Heavy Rains In Vikarabad: తెలంగాణలోని ఆ జిల్లాలో స్కూల్స్‌ బంద్‌

27 Jul, 2022 07:14 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌: తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా వికారాబాద్, పూడూరు మండలాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. మూసీవాగు, కాగ్నానది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

దీంతో రాకపోకలు స్తంభించాయి. గత 24 గంటల్లో అత్యధికంగా కందవాడలో 13.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 4.95 సెం.మీ. నమోదైంది. ప్రధాన ప్రాజెక్టులు శివసాగర్, నందివాగు, జుంటుపల్లి, కోట్‌పల్లి, లఖ్నాపూర్, సర్పన్‌పల్లి తదితర ప్రాజెక్టులు పూర్తిస్థాయి నిండి అలుగు పారు తున్నాయి. తాండూరుకు అన్ని వైపుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వందల  ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి.

కలెక్టర్‌ కార్యాలయం లోతట్టు ప్రాంతంలో ఉండటంతో ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయింది. కాగా, భారీ వర్షాల కారణంగా వికారాబాద్‌ జిల్లాలో విద్యాసంస్థలు అన్నింటికీ కలెక్టర్‌ నిఖిల బుధవారం సెలవు ప్రకటించారు. కాగా, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో అత్యధికంగా 9.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల పంటపొలాలు, ఇళ్లు జలదిగ్బంధం అయ్యాయి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. ఈ క్రమంలో అధికారులు గండిపేట్‌, ఉస్మాన్‌సాగర్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 

ఇది కూడా చదవండి: అర్ధరాత్రి నుంచి దంచికొడుతున్న వాన.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్‌

మరిన్ని వార్తలు