Telangana VRAs: డిగ్రీ విద్యార్హతగల వీఆర్‌ఏలకు పేస్కేల్‌! రెవెన్యూలోనే కొనసాగింపు? 

13 Aug, 2022 12:25 IST|Sakshi

గత 19 రోజులుగా వీఆర్‌ఏల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) వివరాలను ప్రభుత్వం మరోసారి సేకరిస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 22 వేల మందికిపైగా వీఆర్‌ఏలు 19 రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరాలను సేకరించాలని నిర్ణయించడం గమనార్హం. వీఆర్‌ఏల ప్రధాన డిమాండ్‌ అయిన పేస్కేల్‌ అంశాన్ని తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలోనే యుద్ధప్రాతిపదికన వారి వివరాలను పంపాలని తహసీల్దార్లకు సీసీఎల్‌ఏ నుంచి ఆదేశం వచ్చిందని, అందుకే ఈ వివరాలను సేకరిస్తోందని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వీఆర్‌ఏలకు పేస్కేల్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. గౌరవ వేతనంపై నియమితులైన వీఆర్‌ఏలందరికీ పేస్కేల్‌ ఇవ్వడం సాధ్యం కాదని, డిగ్రీ విద్యార్హత ఉన్న వారికి మాత్రమే పేస్కేల్‌ ఇచ్చి వారిని రెవెన్యూలో కొనసాగించాలని, మిగిలిన వారికి గౌరవ వేతనాన్ని యథాతథంగా ఉంచి రెవెన్యూతోపాటు ఇతర విభాగాల్లో వినియోగించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 

ఆ అంశాలివే..: వీఆర్‌ఏల వివరాలను పంపాలంటూ సీసీఎల్‌ఏ నుంచి వివిధ అంశాలతో కూడిన ఫార్మాట్‌ మళ్లీ తహసీల్దార్లకు అందింది. గతంలోనూ ఈ వివరాలను సేకరించినప్పటికీ అన్ని జిల్లాల నుంచి సమగ్ర సమాచారం అందలేదని, ఈ నేపథ్యంలోనే మళ్లీ కలెక్టర్ల నుంచి వివరాలు తీసుకుంటున్నారని తహసీల్దార్లు చెబుతున్నారు. వీఆర్‌ఏల పేరు, పనిచేస్తున్న గ్రామం, మండలం, తండ్రి పేరు, కులం, విద్యార్హత, అపాయింట్‌మెంట్‌ తేదీ, ఎలా నియమితులయ్యారు, పుట్టిన తేదీ, ప్రస్తుత వయసు, క్రమశిక్షణ చర్యలు ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా?, వీఆర్‌ఏ మొబైల్‌ నంబర్‌ వివరాలను ప్రభుత్వం మళ్లీ తీసుకుంటోంది.  

చదవండి: (Munugode- TRS Party: మంచి బట్టలు తొడిగినా ఓర్వలేడు.. ఆయనకు టికెట్టా!)

మరిన్ని వార్తలు