తీరొక్క పూల పండుగ.. బతుకమ్మ

4 Oct, 2021 05:08 IST|Sakshi

రాజ్‌భవన్‌లో మహిళా ఉద్యోగులకు చీరెలు పంపిణీ చేసిన గవర్నర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆనందోత్సాహాల నడుమ రంగు రంగుల పూలతో మహిళలంతా కలిపి జరుపుకునే పండుగ బతుకమ్మ అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లోని మహిళా ఉద్యోగులకు ఆదివారం ఆమె చీరెలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. బతుకమ్మ జరుపుకునేందుకు ప్రకృతి ప్రసాదించిన రకరకాల పూలను వాడుతారని చెప్పారు.


నిమజ్జనం తర్వాత ఈ పూలలో ఉన్న ఔషధ గుణాల కారణంగా చెరువుల్లో, నదుల్లోని నీరు స్వచ్ఛంగా మారుతుందన్నారు. ప్రజలంతా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, భక్తిశ్రద్ధలతో బతుకమ్మ జరుపుకోవాలని సూచించారు. బతుకమ్మ పండుగ సమయంలో గత రెండేళ్లు రాజ్‌భవన్‌లో మహిళా ఉద్యోగులకు గవర్నర్‌ చీరెలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు