బాపూ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌ 

14 Jan, 2022 02:42 IST|Sakshi
బాపూ డైరీనీ ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్‌

కవాడిగూడ: గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్టాన్‌ సంస్థల ఆధ్వర్యంలో రూపొందించిన 2022 నూతన సంవత్సర బాపూ డైరీనీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రగతిభవన్‌లో గురువారం ఆవిష్కరించారు. అనంతరం గాంధీ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ గున్నా రాజేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ వడ్ల సుబ్రమణ్యం మాట్లాడుతూ... తమ డైరీలో ఐక్యరాజ్య సమితి సూచించిన 17 స్థిర అభివృద్ధి లక్ష్యాలను పొందుపరిచినట్లు వెల్లడించారు.

గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సంస్థ ప్రతినిధుల కృషిని మంత్రి కేటీఆర్‌ అభినందించినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని గోశాలలో నిర్వహిస్తున్న రామచంద్ర ప్రకృతి ఆశ్రమానికి హాజరు కావాలని మంత్రి కేటీఆర్‌ను కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి, ఆశ్రమానికి వస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల కార్యదర్శి డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డిగ్రీ కళాశాల సంఘం అధ్యక్షుడు ఎస్‌.వి.సి.ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు