PM Modi Hyderabad Visit: మోదీ పర్యటనకు భారీ భద్రత.. ‘సాలు మోదీ.. సాలు దొర’ ఫ్లెక్సీ వార్‌

29 Jun, 2022 11:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ.. నగర పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేశారు నగర పోలీసులు. ప్రధానితో పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రానున్న కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు ప్రత్యేక భద్రత కల్పించనున్నారు.

సుమారు ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నోవాటెల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. మోదీ పర్యటన ఉన్నంతసేపు మూడంచెల భద్రత కొనసాగనుంది. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌, హెచ్‌ఐసీసీ, రాజ్‌భవన్‌ చుట్టూ కేంద్ర బలగాలు మోహరించాయి.  డ్రోన్‌ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

సాలు.. ఫ్లెక్సీ వార్‌
ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలోని కూడళ్లలో టీఆర్‌ఎస్‌-బీజేపీ వ్యతిరేక ఫ్లెక్సీల వార్‌ ఊపందుకుంది. సాలు దొర.. సెలవు దొర పేరుతో సీఎం కేసీఆర్‌ వ్యతిరేక ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. కౌంటర్‌గా.. బైబై మోదీ.. సాలు మోదీ సంపకు మోదీ అంటూ వ్యతిరేక ఫ్లెక్సీలను టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసింది. ఈ వార్‌పై బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ సైతం స్పందించారు. అధికారులు ఈ ఫ్లెక్సీలను తొలగించే పనిలో ఉన్నారు.

బసపై నిర్ణయం
రాజ్‌భవన్‌లో బస చేస్తే.. ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో.. రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీ బసపై ఎస్పీజీ(Special Protection Group) నిర్ణయం తీసుకోనుంది. 

మరిన్ని వార్తలు