వారికి అవగాహన లేదు

29 Nov, 2023 04:37 IST|Sakshi

రాహుల్, ప్రియాంకలపై కిషన్‌రెడ్డి ధ్వజం

బీజేపీ కనుసన్నల్లో మజ్లిస్‌ పని చేస్తుందన్న వ్యాఖ్యలపై ఆగ్రహం 

కుటుంబ పార్టీలను బహిష్కరించాలని పిలుపు 

పాతచింతకాయ పచ్చడిలాగా.. అరిగిపోయిన గ్రామ్‌ ఫోన్‌ రికార్డులాగా.. రాహుల్, ప్రియాంకా గాం«దీలు అవే అసత్యాలు మాట్లాడుతున్నారు. కేసీఆర్, సోనియా కుటుంబ పార్టీలను ప్రజలు బహిష్కరించాలి

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు రాజకీయంగా కనీస అవగాహన లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. మజ్లిస్‌.. బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తుందన్న రాహుల్‌ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.

రాహుల్‌ గాంధీ కనీసం వచ్చేముందైనా.. వాస్తవాలు తెలుసుకోవాలి కదా? అని నిలదీశారు. ‘మజ్లిస్‌ను పెంచిపోదించింది  మీ కుటుంబం. ముస్లింలీగ్‌ ను ఈ దేశంలో ఎవరు పెంచి పోషించారు.. ఎవరి కారణంగా దేశ విభజన జరిగింది.. వీటన్నింటికీ మీ కుటుంబమే కారణం కాదా?’అని రాహుల్‌గాందీని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత రాజకీయాల్లో భాగంగా.. చెన్నారెడ్డిని గద్దె దించేందుకు మజ్లిస్‌ను ఎగదోసి భాగ్యనగరంలో మతకల్లోలాలు చేసింది కాంగ్రెస్‌ కాదా అని నిలదీశారు. ‘పాతచింతకాయ పచ్చడిలాగా.. అరిగిపోయిన గ్రామ్‌ ఫోన్‌ రికార్డులాగా.. రాహుల్, ప్రియాంక గాం«దీలు అవే అసత్యాలు మాట్లాడారు. అని ఎద్దేవా చేశారు. మంగళవారం నగరంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

సునామీలాగా బీజేపీకి ఓటేస్తారు 
‘30న సునామీలాగా ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారు. 3న బీజేపీ భారీ విజయంతో అధికారంలోకి రానుంది. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి బీసీ సీఎం ఈ గడ్డపై బాధ్యతలు తీసుకోబోతున్నారు’అని ఆయన ధీమా వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మాయలో పడొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ కుటుంబ, సోనియా గాంధీ కుటుంబ పార్టీలను ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

’’తెలంగాణ భద్రంగా ఉండాలంటే.. మా కుటుంబమే అధికారంలో ఉండాలన్న కేటీఆర్‌ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. వీరి కబంధ హస్తాలనుంచి రాష్ట్రం బయటపడాలి. అమరవీరుల ఆకాంక్షలు రావాలంటే.. బీఆర్‌ఎస్‌ పోవాలి. వీళ్ల డిపాజిట్లు గల్లంతు కావాలి’అని కోరారు. తెలంగాణ అభివృద్ధి కోసం,, భావితరాల భవిష్యత్తు కోసం ప్రజల ఓటేయాలని, ప్రధాని మోదీ కోరినట్లుగా రాష్ట్రంలో బీజేపీని ఆశీర్వదించాలని ఆయన కోరారు.  

మేధావులూ ఆలోచించండి: ‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుంది. ఆర్థిక విధ్వంసం ఏర్పడుతుంది. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలి. అని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘ఈ పార్టీలకు సరైన గుణపాఠం చెబుతూ.. బీజేపీకి అండగా నిలవాలని కోరుతున్నాను. మోదీ గ్యారంటీతో తెలంగాణను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తాం. సామాజిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల తెలంగాణ ఏర్పాటుకోసం మేం పనిచేస్తాం’అని స్పష్టం చేశారు.  

బీసీలూ ఆ అవకాశం చేజార్చుకోకండి 
‘బీసీ సామాజిక వర్గానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటేసేముందు ప్రతి బీసీ బిడ్డ.. గుండెమీద చేయివేసుకుని ఆలోచించాలని కోరుతున్నాను. ఈ రోజు బీసీ సీఎం తెలంగాణకు అవసరం. కాబట్టి మీరంతా ఆలోచించండి. మీకు వివిధ రకాల పార్టీలతో సాన్నిహిత్యం ఉండొచ్చు. కానీ బీసీ సీఎం అయ్యే మంచి అవకాశాన్ని చేజార్చుకోకండని విజ్ఞప్తి చేస్తున్నాను’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగొద్దు.. ప్లీజ్‌
♦ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్‌లుకలిసి తెలంగాణను ముుంచడానికే సిద్ధమయ్యాయి... 
♦ ఆ మూడు పార్టీలకు బుద్ధి చెబుదాం 
♦ బీజేపీకి మద్దతిచ్చి రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసుకుందాం. 
♦ ప్రజలకు కిషన్‌రెడ్డి బహిరంగలేఖ 
సాక్షి, హైదరాబాద్‌: ‘ఇక పోలింగ్‌కు మిగిలింది ఒక్క రోజే.. మద్యం, డబ్బు ద్వారా ప్రలోభాలకు గురిచేసేందుకు చాలామంది ప్రయత్నిస్తారు. దయచేసి ఆ ఒత్తిళ్లకు లొంగకండి’అని తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘నేను మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. రాష్ట్ర భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణంగా మద్దతు తెలపాలని కోరుతున్నాను’అని విన్నవించారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాష్ట్ర ప్రజలకు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

’’ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ? దీనిపై ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణమిది. అసలు ఈ పదేళ్లలో రాష్ట్రంలో సంతృప్తి చెందిన వర్గం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఏమైనా అర్థం ఉందా? అనిప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ‘మో దీ ఆశీర్వాదంతో బీసీ సీఎం నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసుకుందాం. అమరవీరులు కలలుగన్న సామాజిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసుకుందాం. ఇది మోదీ గ్యారంటీ! ఇది బీజేపీ గ్యారంటీ’అని ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఆ మూడూ ముంచేస్తాయి: ’’మజ్లిస్‌తో కలిసి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ తెలంగాణను ముుంచడానికే సిద్ధమయ్యాయి. అయితే ను వ్వు, లేదంటే నేను.. మనిద్దరిలో ఎవరైనా ఒకరు అధికారంలో ఉండాలనే లక్ష్యంతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ రెండు పార్టీల చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు ఇదే. 2014, 2018లో కాంగ్రెస్‌ గుర్తుమీద గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయకుండానే.. బీఆర్‌ఎస్‌లో చేరడం, మంత్రిపదవులు పొందడం మనందరికీ గుర్తుండే ఉంటుంది.’’అని పే ర్కొన్నారు.

‘నియామకాల విషయంలో.. ప్రభు త్వం అనుసరించిన విధానం తీవ్ర ఆక్షేపణీయం. ఉద్యమంలో యువత లాఠీ దెబ్బలు, రబ్బరు బుల్లెట్ల గాయాలు, టియర్‌ గ్యాస్‌ను లెక్కచేయకుండా పోరాడితే.. రాష్ట్రం వచ్చాక యువతకు ఒరిగిందేమీ లేదు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేందుకు కారణమైన నిరుద్యోగ యువత.. ఇవాళ ఉద్యోగాలు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితికి చేరుకోవడానికి కారణం కేసీఆర్‌ అసమర్థ పాలన కాదా? టీఎస్‌పీఎస్‌సీ పరిస్థితి ‘మూడు లీకేజీలు, ఆరు రద్దులుగా’మారింది.

రాష్ట్రంలోని 39 లక్షల మంది నిరుద్యోగుల్లో ఒక్కశాతానికైనా ఉద్యోగాలు అందాయా? రూ.3,106 నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ ఎందరికి అందింది?’అని ప్రశ్నించారు. ఇవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని కిషన్‌రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు