సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్‌.. హైకోర్టు నోటీసులు

19 Jul, 2023 11:22 IST|Sakshi

కోకాపేటలో విలువైన భూమిని కేబినెట్‌ అనుమతి లేకుండానే అధికారపార్టీకి కట్టబెట్టారా?

ప్రభుత్వానికి, బీఆర్‌ఎస్‌ పార్టీకి హైకోర్టు నోటీసులు

కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం.. విచారణ వాయిదా 

సాక్షి, హైదరాబాద్‌: భూమి కేటాయింపు విషయంలో కేసీఆర్‌ సర్కార్‌కు షాక్‌ తగిలింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట సర్వే నంబర్‌ 239, 240లో అత్యంత విలువైన 11 ఎకరాల భూమిని భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)కు కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేబినెట్‌ అనుమతి లేకుండానే కేటాయించారా అని ప్రశ్నించింది. కేటాయింపుపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది. 

అయితే, బీఆర్‌ఎస్‌కు 11 ఎకరాల భూమి కేటాయింపును సవాల్‌ చేస్తూ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎన్‌జీవో) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎకరం దాదాపు రూ.50 కోట్ల మార్కెట్‌ విలువైన స్థలాన్ని.. కేవలం రూ.3,41,25,000కే ప్రభుత్వం ముట్టజెప్పిందని.. అలా 11 ఎకరాలకు గానూ దాదాపు రూ.500 కోట్లు ప్రభుత్వానికి నష్టమని పేర్కొన్నారు. దీనిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇంకా కేబినెట్‌ నిర్ణయం తీసుకోలేదన్న ప్రభుత్వం
ప్రభుత్వం తరఫున అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. కోకాపేట్‌లోని 11 ఎకరాల స్థలాన్ని బీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడంపై కేబినెట్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రొసీడింగ్‌ కాపీని పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి టెండర్లు లేకుండానే బీఆర్‌ఎస్‌ పార్టీకి అత్యంత విలువైన ప్రాంతంలో భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. భూమి కేటాయించి.. నిర్మాణం చేపట్టినా ఇప్పటివరకు పబ్లిక్‌ డొమైన్‌లో ఆ వివరాలను ఉంచలేదని సత్యంరెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ కాపీని అందజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్, భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. 

ఇది కూడా చదవండి: కేసీఆర్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. వారికి గుడ్‌న్యూస్‌

మరిన్ని వార్తలు