TSRTC: మూసివేత దిశగా ‘ఆర్టీసీ’ క్రెడిట్‌ సొసైటీ!

14 Jun, 2021 08:45 IST|Sakshi

12 వేలకు చేరుకున్నసభ్యత్వం రద్దు దరఖాస్తులు

ఉపాధ్యక్షుడే దరఖాస్తు చేయటంతో ఉద్యోగుల్లో ఆందోళన 

సొసైటీకి రూ.వెయ్యి కోట్లకుపైగా బకాయి ఉన్న ఆర్టీసీ 

ఎంత కోరినా చెల్లించకపోవడంతో కార్మికుల్లో ఆగ్రహం 

సొసైటీని రద్దు చేసి కార్మికులకు సెటిల్‌మెంట్‌ చేయాలని డిమాండ్లు 

ఈ విషయమై హైకోర్టులో కేసు దాఖలు చేసే ఆలోచన 

సాక్షి, హైదరాబాద్‌: ఆసియా ఖండంలోనే ఉత్తమ సహకార పరపతి సంఘాల్లో ఒకటిగా వెలుగొందిన ‘ఆర్టీసీ కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ’కి గడ్డురోజులు వచ్చాయి. కార్మికులు పొదుపు చేసుకున్న మొత్తాన్నితిరిగి వారి అవసరాలకు రుణంగా అందిస్తూ వడ్డీతో లాభాలు ఆర్జించిన ఈ సొసైటీ.. ఆర్టీసీ యాజమాన్యం తీరు కారణంగా మూసివేతకు చేరువైంది. సొసైటీకి ఆర్టీసీ ఏకంగా వెయ్యికోట్ల రూపాయలకు పైగాబకాయి పడింది. ఆ సొమ్ము చెల్లించకపోవడంతో సొసైటీ ఆర్థిక పరిస్థితి క్షీణించి దివాలా దశకు చేరుకుంది. దీంతో 12 వేల మంది కార్మికులు తమ సభ్యత్వాన్ని రద్దు చేసి, సెటిల్‌మెంట్‌ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో సంఘాన్ని నిర్వహించటం సాధ్యంకాదని.. ఉద్యోగులకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించి మూసివేయాలని కోరుతూ సొసైటీ కార్యదర్శి తాజాగా ఆర్టీసీ యాజమాన్యానికిలేఖ రాశారు. ఈ విషయంగా హైకోర్టులో కేసు కూడా వేయనున్నామని, కోర్టు ద్వారా అన్ని సెటిల్‌మెంట్లు చేయాలని అధికారుల దృష్టికి తెచ్చారు. 

ఏమిటీ సొసైటీ.. ఏం జరిగింది? 
ఆర్టీసీ ఉద్యోగులు అంతర్గతంగా పొదుపు చేసుకుని, అవసరమైనప్పుడు రుణాలు పొందే ఉద్దేశంతో గతంలో సహకార పరపతి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యోగుల జీతం నుంచి ప్రతినెలా 7.5 శాతం సొమ్ము ఈ సంఘానికి చేరుతుంది. మెల్లగా సొసైటీ టర్నోవర్‌ రూ.2 వేల కోట్లకు చేరింది. ఈ సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడం, ఉద్యోగులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం ద్వారా సంఘానికిఆదాయం సమకూరుతుంది. కానీ సరైన పర్యవేక్షణ లేక నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీ.. మెల్లగా సొసైటీ నిధులను వాడేసుకోవడం మొదలుపెట్టింది. మధ్యలో కొంతమేర తిరిగి చెల్లించినా ఇంకారూ.1,060 కోట్ల మేర బకాయి ఉంది. సొసైటీ ఎన్నిసార్లు కోరినా సొమ్మును వెనక్కి ఇవ్వడం లేదు. దీనితో కార్మికులకు రుణాలు అందక ఇబ్బందులు ఎదురయ్యాయి. క్రమంగా సొసైటీ నిర్వహణ కూడాఇబ్బందిగా మారింది. ఈ విషయంగా సొసైటీ ఇంతకుముందే హైకోర్టును ఆశ్రయించింది. 

ఉద్యోగుల్లో ఆందోళన..:
సొసైటీ ఇక కుదురుకునే పరిస్థితి లేదన్న ఉద్దేశంతో ఉద్యోగులు తమ సభ్యత్వాన్ని రద్దు చేసుకుని, రావాల్సిన మొత్తాన్ని సెటిల్‌ చేయాలంటూ దరఖాస్తులు చేస్తున్నారు. చిన్న ఉద్యోగులతోపాటు సీనియర్‌ అధికారులు కూడా ఇదే బాట పట్టడంతో ఆందోళన మొదలైంది. ఇప్పటికే 12 వేల మంది సభ్యత్వం రద్దుకు దరఖాస్తు చేశారు. సొసైటీకి ఎక్స్‌అఫీషియో చైర్మన్‌గా ఆర్టీసీ ఎండీ ఉంటారు. ఒక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారిని వైస్‌ చైర్మన్‌గా నియమిస్తారు. ఇలా వైస్‌ చైర్మన్‌గా ఉన్న ఈడీ యాదగిరి కూడా.. తమ కుటుంబ అవసరాల రీత్యా సొసైటీ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నానని, తనకు రావాల్సిన మొత్తాన్ని సెటిల్‌ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలియడంతో రోజూ నాలుగైదు వందల మంది ఉద్యోగులు సభ్యత్వం రద్దుకు క్యూ కడుతున్నారు.

ఇప్పటికిప్పుడు రూ. 465 కోట్లు కావాలి
మూడేళ్లుగా ఆర్టీసీ సొసైటీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫలితంగా ఇప్పటికే రూ.165 కోట్ల నష్టం వాటిల్లింది. రుణం కోసం ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి.
ఇప్పటికిప్పుడు వాటిని క్లియర్‌ చేయాలంటే కనీసం రూ.465 కోట్లు అవసరమని.. ఆర్టీసీ ఈ మొత్తాన్ని వెంటనే చెల్లిస్తే కార్యకలాపాలు పుంజుకునే అవకాశం ఉందని సొసైటీ పేర్కొంటోంది. సొసైటీని మూసేసి
సభ్యులకు సెటిల్‌మెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

చదవండి: టర్కీ డిజైన్‌లో సచివాలయం మసీదులు

మరిన్ని వార్తలు