సంబరాలు జరిపేందుకు సిగ్గుపడాలి: ఉత్తమ్‌ 

14 Jan, 2022 03:57 IST|Sakshi

మఠంపల్లి: రైతుల రుణమాఫీని అమలు చేయకుండా, భూకబ్జాలను నిలువరించకుండా, బ్యాంకర్లు వసూలు చేస్తున్న వడ్డీలను ఆపకుండా రైతు సంబరాలు జరుపుకొనేందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. వానాకాలం ధాన్యానికి క్వింటాకు రూ.1960 దక్కాల్సి ఉన్నా.. కేవలం రూ.1300 నుంచి రూ.1400కు అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో పంటల బీమా అమలుకాని ఏకైక రాష్ట్రం తెలంగాణానేనని ఎద్దేవా చేశారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమైందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి, పీసీసీ కార్యదర్శి నగేష్‌ ముదిరాజ్, మంజులారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, శివారెడ్డి, మంజీనాయక్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు