తల్లి క్షేమం
సాక్షి, వనపర్తి: బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణి మార్గమధ్యంలో బస్టాండ్ బాత్రూంలోనే ప్రసవించ గా.. పుట్టిన కొద్దిసేపటికే ఆడశిశువు చనిపోయింది. తల్లి ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉంది. ఈ సంఘ టన వనపర్తి జిల్లా కొత్తకోటలో మంగళవారం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా నాగవరం గ్రామానికి చెందిన చంద్రకళ, చంద్రయ్యల కూతురు మంజుల వివాహం గతేడాది ఆత్మకూర్ మండలం తిపుడంపల్లికి చెందిన కృష్ణయ్యతో జరిగింది. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న కృష్ణయ్య తన భార్యతో కలిసి అక్కడే ఉంటున్నారు. మంజుల ప్రస్తుతం 8 నెలల గర్భవతి.
ఆమె ప్రతినెలా వనపర్తి ఏరియా ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. మంగళవారం మంజుల వనపర్తి ఆస్పత్రికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి తిరిగి హైదరాబాద్కు బస్సులో బయల్దేరింది. కొత్తకోటకు వచ్చే సరికి పురిటినొప్పులు రావడంతో అక్కడి బస్టాండ్లో దిగింది. స్థానికులు గమనించి 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. బాత్రూంకు వెళ్లిన మంజుల అంబులెన్స్ వచ్చేసరికి అందులోనే ప్రసవించింది. ఆడశిశువు పురిటిలోనే కన్నుమూసింది. అంబులెన్స్ సిబ్బంది మంజులను కొత్తకోట పీహెచ్సీకి తీసుకెళ్లగా డాక్టర్లు పరీక్షించి ఆమె ఆరోగ్యంగానే ఉందని చెప్పారు.