గుప్త నిధుల కలకలం! ఒక్క‌సారిగా బ‌య‌ట‌ప‌డ్డ‌..

18 Dec, 2023 04:54 IST|Sakshi
పెకిలించిన శివలింగం

శివలింగాన్ని వెలికితీసిన దుండగులు

వికారాబాద్‌: పొలంలో ఉన్న భారీ శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు పెకిలించి, పక్కన పడేశారు. ఈ సంఘటన యాలాల మండల పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. బాధిత రైతు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాలాల గ్రామానికి చెందిన గంగుల వెంకట్‌రెడ్డి తనకున్న 9 ఎకరాల పొలాన్ని విశ్వనాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన నర్సింహ్మరెడ్డికి కౌలుకు ఇచ్చారు. ప్రస్తుతం అందులో కంది, వరిని సాగు చేస్తున్నాడు. కాగా ఆదివారం ఉదయం పొలంలో కంది పంట ధ్వంసం అయినట్లు కౌలురైతు గమనించాడు.

వెళ్లి పరిశీలించగా.. పొలంలోని శివలింగాన్ని బయటికు తీసిన ఆనవాళ్లను గుర్తించాడు. విషయాన్ని పొలం యజమానికి వివరించాడు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు, కళ్లు కవర్లను స్థానికులు గుర్తించారు. సుమారు 5 అడుగులు శివలింగాన్ని వెలుపలకు తీయాలంటే ఐదారుగురి సాయం అవసరమవుతుందని, ఇదంతా గుప్త నిధుల కోసమే జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తంచేశారు. యాలాల చుట్టుపక్కల పెద్ద మొత్తంలో శివలింగాలు ఉండటం, తరుచూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగడం జరుగుతుంటాయని గ్రామస్తులు పేర్కొన్నారు. రైతు వెంకట్‌రెడ్డి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటన స్థలంలో వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఇవి కూడా చ‌ద‌వండి: మరణంలోనూ వీడని బంధం! తల్లడిల్లిన తల్లి హృదయం..

>
మరిన్ని వార్తలు