సాక్షి, వరంగల్: జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. నవంబర్లో జిల్లా వ్యాప్తంగా 405 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తే ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. డిసెంబర్లోనూ 150 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడూ కరోనా మహమ్మారి విషయంలో అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులకు ముందుకు వస్తే చేస్తోంది. నవంబర్, డిసెంబర్లోనూ ఆ పరీక్షలు చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. కరోనా వైరస్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 కేసులు కేరళలో నమోదవ్వడంతో కేంద్రం ఇప్పుడు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువ చేయాలని, వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెనన్స్ టెస్టులు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా పాజిటివ్ కేసు నమోదు కాకపోవడంతో జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ కరోనా వ్యాప్తి సమయంలో పాటించినట్లు జాగ్రత్తలు పాటిస్తే మహమ్మారి వచ్చే చాన్స్ ఉండదని జిల్లా వైద్య విభాగాధికారులు చెబుతున్నారు.
పాజిటివ్ కేసులు జీరో
కేరళలో కరోనా కొత్త సబ్ వేరియంట్!
కేంద్రం అప్రమత్తం