17 మంది తమిళ స్మగ్లర్ల అరెస్ట్‌

9 May, 2018 12:04 IST|Sakshi

కడప అర్బన్‌ : జిల్లాలో చింతకొమ్మదిన్నె మండలం కడప– రాయచోటి రోడ్డులోని కనుమకింద సుగాలి బిడికి గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న 17 మంది తమిళ స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి అరటన్ను బరువున్న 17 ఎర్రచందనం దుంగలు, టాటా టూరిస్ట్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను కడపలో పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) అద్నాన్‌ నయీం ఆస్మి వెల్లడించారు.

 అరెస్టయిన వారంతా తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన వారు. వలగపట్టు గ్రామానికి చెందిన తీర్థగిరి, సెంగటు పట్టూరు గ్రామంలోని రామస్వామి రవి, పులియంపట్టి గ్రామ వాసి అన్నామలై, విల్లుపురం జిల్లా గెండిగల్‌ గ్రామానికి చెందిన రాజేంద్ర, ఎచంకడు గ్రామానికి చెందిన మాణిక్యం, సెంగటుçపట్టూరు గ్రామ వాసి అంగరాజన్, వెలగపట్టులోని వరదరాజ్, వరదరాజన్, సెంగటు పట్టూరు గ్రామానికి చెందిన ఆండి, జయరామ్, సెంథిల్, ఫలణి, సెల్వ కుమార్, విలయరాజ్, తిరుమలై, వెల్‌ మురుగన్‌తోపాటు మరొకరు వున్నారు. 

వీరి వద్ద నుంచి అరటన్ను బరువున్న 17 ఎర్రచందనం దుంగలు, టాటా టూరిస్ట్‌ వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేయడంలో కృషి చేసిన ఎస్‌బీ డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ హేమకుమార్, ఏఎస్‌ఐ దస్తగిరి, హెచ్‌జి రాంప్రసాద్‌ను అదనపు ఎస్పీ అద్నాన్‌ నయీం ఆస్మి అభినందించారు. వారికి రివార్డులు వచ్చే విధంగా ఎస్పీకి సిఫారసు చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

ఎర్రచందనం దుంగల స్వాధీనం
రాజంపేట : మండలంలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద మంగళవారం అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దుంగల విలువ రూ.5 లక్షలు ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. దుంగలను రవాణా చేస్తున్న నిందితుడు వీరేంద్రను అరెస్టు చేశారు. కారును సీజ్‌ చేశారు. రాజం పేట రేంజర్‌ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దాడుల్లో డిప్యూటీ రేంజర్‌ రఘుశంకర్, ఎఫ్‌బీఓ కేవీ సుబ్బయ్య, పీరయ్య, ఎబీఓ శంకరయ్య పాల్గొన్నారు. 

‘ఎర్ర’ దొంగల కోసం వేట
రాయచోటి : వైఎస్సార్‌ జిల్లాలోని ఎర్రచందనం దొంగల కోసం చిత్తూరు జిల్లా పోలీసులు వేట సాగిస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఇటీవల ఎర్రచందనం దుంగలను చిత్తూరు జిల్లా మీదుగా రాష్ట్ర సరిహద్దులను దాటిస్తూ.. చిత్తూరు జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. ఇలా పట్టుబడిన స్మగ్లర్లు అందించిన సమాచారం మేరకు.. అడవిలో దుంగలను నరికి తరలించే వరకు సహకరించింది కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

 స్మగ్లర్లకు ఉప్పందించడం, తరలింపులో భాగస్వామ్యం ఉన్న వారి కోసం రెండు రోజులుగా రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు, వీరబల్లి, సుండుపల్లి మండలాల పరిధిల్లో గాలిస్తున్నట్లు తెలిసింది. చిత్తూరు జిల్లా వాయల్పాడు సర్కిల్‌ పరిధిలోని పోలీసులు కడప జిల్లాలోని స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు. కొన్నేళ్లుగా రాయచోటి ప్రాంతం నుంచి స్మగ్లింగ్‌ తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో.. చిత్తూరు జిల్లా పోలీసుల గాలింపు ఇక్కడి స్మగ్లర్లలో గుబులు రేపుతోంది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల మీదుగా చేపడుతున్న అక్రమ రవాణాపై జిల్లా పోలీసుల దాడులు అధికమయ్యాయి. 

ఇలాంటి తరుణంలో స్మగ్లర్లు తిరిగి రాయచోటి, సుండుపల్లె ప్రాంతాల మీదుగా చిత్తూరు జిల్లా సరిహద్దుల నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోకి తరలిస్తున్నట్లు పోలీసులు పసిగట్టారు. ఆ క్రమంలోనే దాడులు చేసి పట్టుకున్నట్లు సమాచారం. పట్టుబడిన వారిని పోలీసుల నుంచి తప్పించేందుకు, వారు ఇచ్చిన సమాచారం మేరకు అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులపై రాజకీయ నేతలు ఒత్తిడిలు అధికమైనట్లు తెలియవచ్చింది. చిత్తూరు జిల్లా పోలీసుల అన్వేషణ విషయం తమకు తెలియదని రాయచోటి ప్రాంత పోలీసులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు