సేవ చేయాలనే వైఎస్సార్‌ సీపీలోకి..

25 Dec, 2018 12:45 IST|Sakshi
సినీనటుడు భానుచందర్‌ను సన్మానిస్తున్న రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పెనుమత్స శ్రీనివాస్‌రాజు

జగన్‌లో బుద్ధుడు కనిపిస్తున్నాడు..

సినీనటుడు భానుచందర్‌

ద్వారకానగర్‌(విశాఖ దక్షిణ): నలభై సంవత్సరాల పాటు సినీ కళామతల్లి నీడలో ఎన్నో వైవిద్యభరిత పాత్రలు పోషించానని, ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్‌ సీపీలో చేరినట్టు సినీనటుడు భానుచందర్‌ అన్నారు. సోమవారం దొండపర్తిలోని ఫిలిం ఫెడరేషన్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో సాగిన ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న సమయంలో వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిలో ఓ బుద్ధుడ్ని చూశానని చెప్పారు. ఔధార్యం, ఓర్పు, సహనంతో పాటు ప్రజలు కష్టాలు తెలుసుకున్న మంచి వ్యక్తి జగన్‌ అని తెలిపా రు. దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆత్మ ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిలో ఉందని వివరించారు. పార్టీలో చేరిన విషయంపై తన స్నేహితుడు సుమన్‌తో కూడా చర్చించానని తెలిపారు.

తన కుమారుడు జయంతి మొదటి చిత్రం మిక్చర్‌ పొట్లాంను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో రెండో చిత్రం విడుదలౌతుందని, ఆదరించాలని కోరారు. మార్షల్‌ ఆర్ట్స్‌ ఇతివృత్తంగా చిత్రాలు ప్రస్తుతం కరువయ్యాయన్నారు. తాను నటించిన ‘ఎన్‌టీఆర్‌’బయోపిక్‌ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుందని, తాను డీఎస్పీగా నటనకు ఆస్కారమున్న పాత్ర పోషించానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాçష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పెనుమత్స శ్రీనివాస్‌రాజు, దినేష్‌రెడ్డి, బాషా, శ్రీనివాసరావు, పార్టీ విశాఖ పార్లమెంట్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బి.కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు