'విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలు వినియోగించుకోవాలి'

14 Apr, 2020 13:33 IST|Sakshi

సాక్షి, అమరావతి : లాక్‌డౌన్‌ నేపథ్యంలో టెన్త్‌ పరీక్షలు ఇప్పుడు నిర్వహించలేమంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు మరింత పెరగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టెన్త్‌ పరీక్షలు ముగిసేవరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాల బోధన చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారన్నారు. ఇందుకోసం విద్యామృతం పేరుతో కార్యక్రమాన్ని రూపొందించి ఉదయం 10 నుంచి 11వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సప్తగిరి చానెల్‌ ద్వారా పాఠాలు ప్రసారం అవుతాయని తెలిపారు. టెన్త్‌ పరీక్షలు రాసే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సురేశ్‌ వెల్లడించారు. కాగా ఆన్‌లైన్‌ పాఠాలు బోధించేందుకు అన్ని శాఖల పరిధిలోని స్కూల్స్‌ నుంచి టీచర్ల ఎంపిక చేస్తున్నామని, విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉత్సాహం ఉన్న టీచర్స్‌ ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

మంత్రి శంకర్‌ నారాయణ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ పొడిగింపుపై తీసుకున్న నిర్ణయం తాము స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం పకడ్బందీ చర్యలు అవసరమన్నారు. ప్రధాని మోదీ తెలిపినట్లుగా ఏప్రిల్‌ 20 తర్వాత ఆంక్షల సడలింపులో రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మా ప్రభుత్వ మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నారని శంకర్‌ నారాయణ వెల్లడించారు.

మరిన్ని వార్తలు