‘అగ్రిగోల్డ్’పై ఆగ్రహాగ్ని

6 Jan, 2015 03:31 IST|Sakshi
‘అగ్రిగోల్డ్’పై ఆగ్రహాగ్ని

 శ్రీకాకుళం క్రైం:చెల్లింపుల్లో ఇటీవల జరుగుతున్న జాప్యం.. కొందిరికి ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడం.. సంస్థ విజయవాడ కార్యాలయంలో సీబీఐ సోదాలు.. తదితర పరిణామాలు అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారుల్లో అలజడి, ఆందోళనకు కారణమయ్యాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న ఖాతాదారులు పెద్దసంఖ్యలో శ్రీకాకుళంలోని సంస్థ ప్రాంతీయ కార్యాలయం వద్దకు తరలివచ్చారు. ఆ సమయంలో కార్యాలయం మూసివేసి ఉండటంతో వారు మరింత ఆగ్రహానికి గురై ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. తమను మోసం చేసి బోర్డు తిరగేసేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని పలువురు ఆరోపించారు. మరోవైపు పలాస కార్యాలయం వద్ద కూడా పలువురు ఖాతాదారులు, సంస్థ ఏజెంట్లు కార్యాలయానికి రాగా బీఎం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 ఖాతాదారులు అందించిన వివరాల ప్రకారం.. అగ్రిగోల్డ్ సంస్థలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన ఖాతాదారులకు కాలపరి మితి ముగిసిన తర్వాత సొమ్ము చెల్లింపులో కొన్ని నెలులుగా తీవ్ర జాప్యం జరుగుతోంది. గట్టిగా అడిగిన వారికి చెక్కులిచ్చి పంపిస్తున్నారు. వాటిని బ్యాం కులో వేస్తే సంస్థ ఖాతాలో సొమ్ము లేక తిరిగి వచ్చేస్తున్నాయి. జిల్లాలో శ్రీకాకుళ ంతో పాటు పాలకొండ, రాజాం, నరసన్నపేటల్లో అగ్రిగోల్డ్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 20 వేల మంది ఖాతాదారులు ఉన్నారు. వీరి నుంచి సుమారు రెండు కోట్ల వరకు టర్నోవర్ చేస్తున్నట్టు సంస్థ అధికారులే చెబుతున్నారు. కాలపరిమితి ముగిసిన బాండ్లకు వెంటనే సొమ్ము చెల్లించకుండా జాప్యం చేస్తుండటంతో ఇప్పటికే జిల్లాలో రెండు మూడు చోట్ల ఖాతాదారుల నిలదీసిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో అగ్రిగోల్డ్ ఖాతాదారులు ఆందోళనకు దిగడం, సంస్థపై సీబీఐ సోదాలు, దర్యాప్తు చేయడంతో సంస్థ మనుగడపై ఖాతాదారు ల్లో అనుమానాలు, ఆందోళన ప్రారంభమయ్యాయి.
 
 తెరుచుకోని కార్యాలయం
 దీంతో జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో ఖాతాదారులు సోమవారం ఉదయం శ్రీకాకుళంలోని అగ్రిగోల్డ్ ప్రాంతీయ కార్యాలయానికి తరలివచ్చారు. ఆ సమయంలో కార్యాలయానికి తాళాలు వేసి ఉండటం, ఒక్క సెక్యూరిటీ గార్డు మాత్రమే ఉండటంతో మరింత ఆందోళనకు గురయ్యారు. ఉదయం 11 గంటలు దాటుతున్న కార్యాలయ సిబ్బంది ఎవరూ రాకపోవటంతో ఆగ్రహించిన ఖాతాదారులు అక్కడే ఆందోళనకు దిగారు. బాండ్లు చూపిస్తూ తాము కట్టిన డబ్బు వెంటనే తిరిగి ఇవ్వాలని నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కార్యాలయం వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇదిలా ఉండగా తమకు బందోబస్తు కల్పించాలంటూ అగ్రిగోల్డ్ అధికారులు పోలీసులను అశ్రయించారు.
 
 కాల పరిమితి ముగిసి     మూడు నెలలైనా..
 9.4.2008 తేదీన రూ.10 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాను. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీకి కాలపరిమితి ముగిసింది. రావలసిన రూ.20 వేల కోసం కార్యాలయానికి వెళ్లి అడిగితే.. అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తాం అంటూ మూడు నెలలుగా తిప్పుతున్నారు.
 - పైడి రఘునాథం, ఫరీదుపేట
 
 చెల్లని చెక్కు ఇచ్చారు
 నా బాండ్ కాలపరిమితి పూర్తి కావడంతో గత నెల 25న రూ.43,200కు చెక్కు ఇచ్చారు. దాన్ని బ్యాంకులో వేస్తే సంస్థ ఖాతాలో డబ్బులు లేక వెనక్కి వచ్చింది. చెల్లని చెక్కులిచ్చి మోసం చేశారు. అలాగే కూతురి పెళ్లి కోసం 30.6. 2008 తేదీన రూ. 30 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాను. దీని కాలపరమితి గత నెల 30వ తేదీకి పూర్తి అయ్యింది. రూ.60 వేలు రావాల్సి ఉంది. దానికి చెక్కు ఇస్తామంటూ ఇంతవరకు తిప్పించుకుంటున్నారు.  
 -డి.ఆదినారాయణ, ఎస్.ఎస్.ఆర్.పురం
 
 సీబీఐ దర్యాప్తు పూర్తికాగానే చెల్లింపులు
 సంస్థపై సీబీఐ దర్యాప్తు పూర్తికాగానే ఖాతాదారులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇచ్చేస్తామని సంస్థ ఉన్నతాధిధికారులు తెలిపారు. అయితే సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో ఖాతాదారులు చాలా మంది మధ్యలోనే డబ్బులిచ్చేయమని కోరుతుండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత జులై వరకు చెల్లింపులన్నీ పూర్తి చేశాం. ఆ తర్వాత నుంచే పెండింగులో ఉన్నాయి. వారిలో కూడా కొందరికి అలస్యమైన కాలానికి కొంత మొత్తం కలిపి ఇచ్చాం. అందువల్ల మిగిలినవారు ఆందోళన చెందనవసరం లేదు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసుల సహకారంతో కార్యాలయాన్ని తెరుద్దామనుకున్నాం.             -శ్రీనివాసరావు,
  అగ్రిగోల్డ్ రిజనల్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్
 
 మేడపై నుంచి పడిన ‘అగ్రి’ ఖాతాదారుడు
 శ్రీకాకుళం క్రైం: శ్రీకాకుళంలోని అగ్రిగోల్డ్ కార్యాలయం మేడపై నుంచి బరాటం శ్రీరామూర్తి అనే ఖాతాదారుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. తమకు రావల్సిన డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని ఓ భవనంలో రెండవ అంతస్తుల్లో ఉన్న అగ్రిగోల్డ్ కార్యాలయం వద్ద సోమవారం ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన బరాటం శ్రీరామూర్తి కూడా కార్యాలయం వద్దకు వచ్చి మెట్లుపై కూర్చున్నాడు. అయితే తీవ్ర మనస్తాపంతో ఉన్న అతను ఒక్కసారిగా కళ్లు తిరగటంతో రెండు అంతస్తుల పైనుంచి సందులో నుంచి కిందకు పడిపోవడంతో నడుం భాగంగాలో గాయమైంది. మిగిలిన ఖాతాదారులు అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు వెంటనే స్పందించి శ్రీరామూర్తిని జీపులో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు