ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో నడుస్తూ వెళ్తున్న గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని వర్గాల వారు ప్రస్తుత ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న అవస్థలను ఆయన వద్ద ఏకరువు పెడుతున్నారు. జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే తమ కష్టాలు తీరుతాయని చెప్పుకొచ్చారు.
ప్రజాసంకల్పయాత్ర బృందం: పుష్కర కాలంగా సెకండ్ ఏఎన్ఎంలుగా పని చేస్తున్నా...ఇప్పటికీ మాకు ఉద్యోగ భద్రత లేదంటూ ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రోజు సెలవు పెట్టినా వేతనం ఇవ్వడం లేదంటూ వాపోయారు. పనికి తగ్గ వేతనం కూడా ఇవ్వడం లేదని, ప్రసూతి సెలవులు కూడా మంజూరు చేయడం లేదని తెలిపారు. గర్భిణిగా ఉన్నా సెలవు మంజూరు కాక విధులు నిర్వహించామంటూ వాపోతయారు. డెలివరీ రోజు వరకూ పని చేయాల్సి వచ్చిందన్నా...అంటూ రోదించారు. శస్త్రచికిత్స చేసి బిడ్డను తీసినా...విధులు చేయాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాలాంటి వారు మక్కువ మండలంలో ఎనిమిది మంది, సీతానగరంలో ఏడుగురు ఉన్నారని తెలిపారు. మీరు అధికారంలోకి రాగానే మాకు ఉద్యోగ భద్రత కల్పించి, ప్రసూతి సెలవులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని మక్కువ, సీతానగరం మండలాలకు చెందిన చిల్లారపు సరస్వతి, నేతూరి సత్యవతి కోరారు.