అక్రమం చేసిందొకరు.. బలయ్యేది ఎందరో..?

14 Aug, 2018 15:58 IST|Sakshi
సున్నపు క్వారీ.. ఇన్‌సెట్లో యరపతినేని శ్రీనివాస్‌రావు

సాక్షి, గుంటూరు : టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌రావు గురజాలలో చేసిన అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో కిందిస్థాయి ఉద్యోగులను బలి చేసే కుట్ర జరుగుతోందని అధికారులు వాపోతున్నారు. అక్రమ మైనింగ్‌లో ఉద్యోగుల్ని బాధ్యుల్ని చేసి.. అక్రమ సున్నపురాయి క్వారీల కేసును ప్రభుత్వం నీరుగార్చేందుకు పావులు కదుపుతోందని వారు అంటున్నారు. ఈ కేసు నుంచి ఎమ్మెల్యే యరపతినేనిని తప్పించడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని వారు చెప్తున్నారు.

అక్రమ మైనింగ్‌ జరిగిన పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తోన్న అధికారులకు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. మైనింగ్‌ అక్రమాలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ నలుగురు తహశీల్దార్లు, ఐదుగురు వీఆర్వోలు, ఐదుగురు గ్రామ కార్యదర్శులకు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. కిందిస్థాయి ఉద్యోగుల్ని బదిలీ చేసి అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇవ్వాలని భావిస్తోందని, అందుకే కిందిస్థాయిలో ఉన్న తమను టార్గెట్‌ చేస్తున్నారని ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన రాజకీయ నేతలు, వారికి సహకరించిన ఉన్నత అధికారులపై చర్యలు తీసుకోకుండా.. తమను లక్ష్యంగా చేసుకోవడంపై వారు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు