రైట్‌.. రైట్‌..

13 May, 2020 11:20 IST|Sakshi

ఆర్టీసీ బస్సులకు గ్రీన్‌ సిగ్నల్‌

సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు

ఆన్‌లైన్‌లోనే టికెట్ల కొనుగోలు  

అనంతపురం క్రైం: లాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు త్వరలోనే రోడ్డెక్కనున్నాయి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపు ఇవ్వడంతో ప్రజా రవాణా శాఖాధికారులు బస్సులు తిప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆర్టీసీ(పీటీడీ) ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆర్‌ఎంలకు 18వ తేదీకల్లా బస్సులను తిప్పేందుకు సిద్ధంగా ఉండాలని సర్క్యులర్‌ జారీ  చేశారు. దీంతో అనంతపురం రీజియన్‌లో ఆర్‌ఎం సుమంత్‌ వివిధ డిపోల్లోని డీఎం, తదితరులను అప్రమత్తం చేశారు. 

సీటింగ్‌ మార్పు.. ఆన్‌లైన్‌ బుకింగ్‌
ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు మొదటి దశగా రీజియన్‌లో 635 బస్సులు తిప్పాలని అధికారులు నిర్ణయించారు. దీంతో మంగళవారం అనంతపురం డిపోలో డిప్యూటీ సీఎంఈ మోహన్‌కుమార్, డీఎం ఆర్‌. పిచ్చయ్య సూపర్‌ లగ్జరీ బస్సుల్లో సీటింగ్‌ ఏవిధంగా ఏర్పాటు చేయాలని గ్యారేజ్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. దీంతో ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సీటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే  బస్సులో 50 శాతం మందే ప్రయాణించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా టికెట్లు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే బుక్‌ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక వేళ బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటే బస్టాండ్లలో కండక్టర్లు ఫోన్‌ పే, గూగుల్‌ పే, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేస్తారు.  

మరిన్ని వార్తలు