ప్రజల వద్దకు బ్యాంకర్లు

7 Jan, 2016 23:38 IST|Sakshi

 విజయనగరం అర్బన్: బ్యాంకుల్లో బారులు తీరి నించునే రోజులు పోయి బ్యాంకర్లే గ్రామాలకు వచ్చి వినియోగదారుల ముందు బారులు తీరుతున్నారు. బ్యాంక్ శాఖకు పరిధిలో ఉన్న ప్రజలు, ఖాతాదారులకు అందుబాటులో బ్యాంక్ అధికారులు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆదేశాలు జిల్లా లీడ్ బ్యాంక్ కార్యాలయానికి బుధవారం వచ్చాయి. ఏడాదిగా కేంద్రప్రభుత్వం అందిస్తున్న సేవింగ్ ఖాతాల ప్రారంభించడం, బీమా, రుణ, పెన్షన్ పథకాలను విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, ఆ దిశగా ప్రజలకు తెలియజే కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొన్నారు.
 
 ఇందుకోసం జిల్లాలోని ప్రతి బ్యాంక్ శాఖ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. బ్యాంక్ శాఖలు లేని గ్రామాల్లో బిజినెస్ కరెస్పాండెంట్‌లను తక్షణమే నియమించుకోవాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు బ్యాంక్ పరిధిలో గ్రామాలకు ప్రతి బుధవారం మధ్యాహ్నం పూట బ్యాంకర్లు విధిగా వెళ్లి జన్మభూమి కమిటీల సమక్షంలో ప్రజలకు ఖాతాదారులకు, గ్రామ సభలను నిర్వహించాలి. అదే పట్టణ పరిధిల్లో అయితే బ్యాంక్ కార్యాలయం ఆవరణలో ఖాతాదారులకు ప్రతి బుధవారం మధ్యాహ్నం పూట అవగాహన సదస్సులను నిర్వహించాలి.
 
 నివేదికలు పంపాలి: లీడ్ బ్యాంక్ మేనేజర్
 రాష్ట్ర స్థాయి లీడ్ బ్యాంక్ ఆదేశాల మేర కు బ్యాంకర్లు ప్రతి బుధవారం జన్మభూమి కమిటీలతో నిర్వహించిన సదస్సుల నివేదికను జిల్లా కేంద్రాలకు పంపాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎ.గురవయ్య తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి బుధవారం గ్రామాలకు వెళ్లి గ్రామ సభలను నిర్వహించాలని తెలి పారు. అదే పట్టణ ప్రాంతాలలో అయితే ప్రతి బుధవారం బ్యాంక్ కార్యాలయం ఆవరణలో నిర్వహించాలని ఆదేశాలొచ్చాయని చెప్పారు. వారంలో అందజేసిన వివిధ రకాల సేవలకు ఖాతాదారులకు వివరిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థ తాలూకా ప్రాధాన్యతను వివరించాలని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు