చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు: బొత్స

8 May, 2015 23:03 IST|Sakshi
చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు: బొత్స

విజయనగరం: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి అబద్దాలకోరని, తోటపల్లి ప్రాజెక్టు విషయంలో అన్నీ అసత్యాలు చెబుతున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. డీసీసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టుకు 2003 బడ్జెట్‌లో రూ.352 కోట్లు కేటాయించినట్టు చంద్రబాబు అబద్ధం చెప్పారని ఆరోపించారు. ఇంత పచ్చిగా అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదన్నారు.

తోటపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తి చేశామని, మిగిలిన 10 శాతం పనులను పూర్తిచేసి నీరు అందించాలని టీడీపీ అధికారంలోకిరాగానే పత్రికా సమావేశం పెట్టి కోరామని పేర్కొన్నారు. కానీ ఈ ఖరీఫ్‌కు కూడా నీరు అందే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రూ.120 కోట్లు ఖర్చు చేస్తే తోటపల్లి ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. టీడీపీ నేతలు అర్భాటాలు మాని పనిచేసి చూపించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం తగదన్నారు. ప్రత్యేకా హోదాపై చట్టం తెస్తే బాగుంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అంటున్నారని, బిల్లు పెట్టినపుడు రాజ్యసభలో ఉన్న ఆయన చట్టంలో పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు