‘టీ’ నోట్ ఆమోదంపై జిల్లాలో సంబురాలు

4 Oct, 2013 00:33 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటన వెలువడిన వెంటనే పలుచోట్ల తెలంగాణవాదులు రోడ్లపైకి వచ్చి సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ పురిటగడ్డ సిద్దిపేటలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించాయి. టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్‌లో మిఠాయిలు పంచారు. సంగారెడ్డిలో తెలంగాణ జేఏసీ పశ్చిమ జిల్లా కమిటీ అధ్యక్షుడు వై. అశోక్‌కుమార్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ నేతృత్వంలో ఐబీ అతిథి గృహం వద్ద సంబురాలు జరుపుకున్నారు. బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుతూ తెలంగాణవాదులు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ై
 
 హెదరాబాద్‌ను తాత్కాలిక రాజధానిగానే అంగీకరిస్తామని, ఉమ్మడి రాజధానిగా అంగీకరించేది లేదని టీజేఏసీ నేతలు ప్రకటించారు. అందోలు నియోజకవర్గ కేంద్రం జోగిపేటలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పులుగు కిష్టయ్య నేతృత్వంలో బాణసంచా పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. తొగుటలో టీఆర్‌ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి హర్షం వ్యక్తం చేశారు. తూప్రాన్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం బాణసంచా కాల్చారు. గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ మిఠాయిలు పంపిణీ చేశారు. కోహీర్‌లో విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ ఆధ్వర్యంలో తెలంగాణవాదులు మిఠాయిలు పంపిణీ చేశారు. రాష్ట్ర ఏర్పాటు అంశంపై కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రకటనలు విడుదల చేశారు.  
   

మరిన్ని వార్తలు