కొత్తవలస- కోరాపుట్ డబ్లింగ్ పనులకు ఓకే

18 Nov, 2015 19:49 IST|Sakshi

న్యూఢిల్లీః విజయనగరం జిల్లా కొత్తవలస - ఒడిశాలోని కోరాపుట్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన  కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కొత్తవలస-కోరాపుట్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

189.278 కి.మీ. పొడవైన ఈ మార్గంలో రూ. 2977.64 కోట్ల అంచనా వ్యయంతో డబ్లింగ్ పనులు చేపడతారు. ఈ డబ్లింగ్ పనుల వల్ల ఆయా ప్రాంతాల మధ్య సరుకు రవాణా సులభతరం కావడమే కాకుండా రైల్వే ఆదాయం పెరుగుతుంది. ఈ పనులు వచ్చే ఏడేళ్లలో పూర్తవుతాయని అంచనావేసింది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. ఈ జిల్లాల మధ్య వివిధ రకాల ఖనిజాలు, ముడిసరుకు, ఇతర వస్తు రవాణా అవసరాలు పెరుగుతున్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు