చంద్రబాబువి నీతిమాలిన రాజకీయాలు మాజీ మంత్రి కాసు

26 Feb, 2016 02:21 IST|Sakshi
చంద్రబాబువి నీతిమాలిన రాజకీయాలు మాజీ మంత్రి కాసు

నరసరావుపేట వెస్ట్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నీతి మాలిన రాజకీయాలకు తెరతీశారని మాజీ మంత్రి, పీసీసీ క్రమ శిక్షణ సంఘం చైర్‌పర్సన్ కాసు వెంకటకృష్ణారెడ్డి విమర్శించారు. తన గృహంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని కాసు ప్రశ్నించారు. రాను రాను విలువలతో కూడిన రాజకీయాలు తెరమరుగు కావటం బాధగా ఉందన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ తగ్గిపోతున్నాయన్నారు. నరసరావుపేటలో అధికారులు, పాలకులకు ముందుచూపులేకపోవటం వల్లనే తాగునీటి ఇబ్బందులు వచ్చాయన్నారు.

రెండు, మూడు నెలలుగా తాను పరిస్థితిపై హెచ్చరిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారన్నారు.  స్వచ్ఛ నరసరావుపేటకు తిలోదకాలు ఇచ్చారని, ఎక్కడ చూసినా కంపు కొడుతోందన్నారు. కోటప్పకొండ తిరునాళ్ల నాటికైనా పూర్తిస్థాయిలో తాగునీరు అందించాలని, లేకుంటే లక్షలాది మంది యాత్రికలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం వెన్నుపోటులతో కూడిందేనని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఆశచూపించి తన పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు.

మరిన్ని వార్తలు