‘దారి’ దొరికింది

2 Nov, 2019 12:42 IST|Sakshi

స్పందించిన  కలెక్టర్‌ హరి కిరణ్‌

కొట్రాళ్లకు తారురోడ్డు

రూ.92 లక్షల నిధులు మంజూరు

కడప సిటీ: కొట్రాళ్ల దళితవాడకు దారి దొరికింది.ఎన్నో ఏళ్లుగా ఉన్న రోడ్డు సమస్యకు పరిష్కారం దొరికింది.ఏకంగా తారు రోడ్డు వేసేందుకు నిధులు మంజూరయ్యాయి.జిల్లా కలెక్టర్‌ హరి కిరణ్‌ స్పందించి ఈ రోడ్డు నిర్మాణానికి రూ.92 లక్షల నిధులు మంజూరు చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.యదుభూషణ్‌రెడ్డి ఈ విషయం తెలిపారు.సంబేపల్లె మండలం దుద్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని కొట్రాళ్ల దళితవాడలో రోడ్డు లేక పోవడంతో పడుతున్న కష్టాలపై సాక్షిలో శుక్రవారం ‘మరో దారి లేదు’ అనే శీర్షికన అ వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే.

దీనిపై జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌  చొరవ తీసుకుని డ్వామా పీడి యదుభూషణ్‌ రెడ్డి, పంచాయతీ రాజ్‌ ఈఈ రామలింగారెడ్డిలను ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణానికి శుక్రవారం సాయంత్రమే ఆదేశాలు కూడా జారీ చేశారు. పంచాయతీ రాజ్‌ పనులు చేపట్టగా నిధులు మాత్రం ఉపాధి హామీ నుండి రూ.82.80 లక్షలు,డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌(డిఎంఎఫ్‌) కింద రూ.9.20 లక్షలు మంజూరు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.త్వరలో రోడ్డు పనులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అధికారులు శుక్రవారం ఉదయం గ్రామాన్ని సందర్శించారు.

మరిన్ని వార్తలు