ఆర్టీసీ బస్సులో కానిస్టేబుల్‌ వీరంగం

6 Sep, 2018 10:38 IST|Sakshi

బెదిరించి మహిళను సీటు ఖాళీ చేయించిన వైనం

సాక్షి, నరసరావుపేట టౌన్‌: ఆర్టీసీ బస్సులో ఓ కానిస్టేబుల్‌ ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన గుంటూరు జిల్లా నరసరావు పేటలో బుధవారం జరిగింది. నరసరావుపేట నుంచి వినుకొండ వెళ్లే ఆర్టీసీ బస్సులో నాగేశ్వర రావు అనే కానిస్టేబుల్‌ ఇద్దరు ఖైదీలను వెంటబెట్టుకొని ఎక్కాడు. అప్పటికే ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులను లేవాలని కోరాడు. దానికి వారు నిరాకరించటంతో మర్యాదగా లేచి సీటు ఇవ్వకుంటే అంతు చూస్తానంటూ బెదిరించాడు. ఆ సమయంలో మరో ప్రయాణికుడు కలుగజేసుకోగా అతని చొక్కా పట్టుకొని దురుసుగా వ్యవహరించాడు.

సీట్లో కూర్చొని ఉన్న మహిళా ప్రయాణికురాలిని సైతం అసభ్యపదజాలంతో దూషించాడు. ఇష్టారాజ్యంగా ప్రయాణికులతో వాదనకు దిగటంతో బస్సు డ్రైవర్‌ ప్రయాణికులకు సర్దిచెప్పి సీటు ఖాళీ చేయించి ఇప్పించాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ప్రయాణికులు అనటంతో దిక్కున్నచోట చెప్పుకోమని కానిస్టేబుల్‌ బెదిరించాడు. విధినిర్వహణలో మద్యం తాగి వచ్చి కానిస్టేబుల్‌ అనుచితంగా ప్రవర్తించాడని ప్రయాణికులు వాపోయారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు