నందిగామ: తరచూ పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను నందిగామ పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.20 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి శనివారం నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏసీపీ జనార్దన్ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చీరాలకు చెందిన షేక్ అల్తాఫ్ ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. కూలి పనులు చేసుకుంటూ జీవించే అల్తాఫ్ కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. చోరీ కేసులో జైలులో ఉన్న సమయంలో కంచికచర్లకు చెందిన మణికంఠ అల్తాఫ్కు పరిచయమయ్యాడు. వారిద్దరూ కలిసి నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో 4, జగ్గయ్యపేట స్టేషన్ పరిధిలో 1, వత్సవాయి పోలీస్ స్టేషన్ పరిధిలో 1, కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 1, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 1, తెలంగాణ రాష్ట్రం కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2, నేలకొండపల్లిలో 1, ఖమ్మం త్రీ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో 1, హస్తినాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం చొప్పున మొత్తం 13 చోట్ల తాళం వేసి ఉన్న ఇళ్లు, దుకాణాలలో చోరీకి పాల్పడినట్లు తెలిపారు. ఆయా చోరీలలో వారు దొంగిలించిన 156 గ్రాముల బంగారు ఆభరణాలు, 8.820 కేజీల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు చోరీలకు ఉపయోగించిన కారు, బైకులతో పాటు వారి వద్ద నుంచి రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటి మొత్తం విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని ఏసీపీ తెలిపారు.
రూ.20 లక్షల విలువైన సొత్తు స్వాధీనం