కుట్రలకు చెక్

30 May, 2014 02:45 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడ్డ టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులను ప్రలోభపెట్టేందుకు  నానా యాగి చేస్తున్నారు. మెజార్టీ జిల్లా పరిషత్ సభ్యులు, నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లను వైఎస్సార్‌సీపీ దక్కించుకున్న విషయం విదితమే. అధికారాన్ని అడ్డుపెట్టుకున్న టీడీపీ అటు జిల్లా పరిషత్, ఇటు కార్పొరేషన్ స్థానాలను దక్కించుకునేందుకు కుట్రలకు తెరలేపింది.
 
 అందులో భాగంగా వైఎస్సార్‌సీపీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసేందుకు ఎత్తులు ప్రారంభించింది. వైఎస్సార్‌సీపీ సభ్యులు ససేమిరా అనడంతో పార్టీ గుర్తింపును సాకుగా చూపి మాకు మద్దతు ఇచ్చినా మీపైన చర్యలుండవంటూ కొత్త నాటకానికి తెరలేపుతుంది. అయినా వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రలోభాలకు గురికాలేదు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు తమవైపే ఉన్నారని అటు జిల్లా పరిషత్, ఇటు కార్పొరేషన్లు తమకే దక్కనున్నాయంటూ టీడీపీ ఎల్లో కథనాలు రాయిస్తూ కొత్త నాటకానికి తెరలేపింది. జిల్లా పరిషత్‌కు సంబంధించి మొత్తం 46 స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ 31 స్థానాలను గెలుచుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. ఇక నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 54 మంది కార్పొరేటర్లకు గాను వైఎస్సార్‌సీపీ 32 మంది కార్పొరేటర్లను గెలుచుకుంది.

ఈ రెండు స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి వెళ్లాయి. కావలి, గూడూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు మున్సిపాల్టీల్లోను వైఎస్సార్‌సీపీకే మెజారి టీ ఉంది. రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆ రెండు స్థానాలకు అటు జిల్లా పరిషత్, ఇటు కార్పొరేష న్, మున్సిపాలిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఈ లోపు టీడీపీ అధికారం చేపట్టడంతో టీడీపీ నేతలు కుట్రలకు తెరలేపారు. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు లభించలేదన్న వార్తతో వారు చెలరేగిపోయారు. ఎలాగైనా వైఎస్సార్‌సీపీ సభ్యులను ప్రలోభపెట్టి ఇటు జెడ్పీ, కార్పొరేషన్ల అధికార పీటాలను దక్కించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు కొందరు వైఎస్సార్‌సీపీ సభ్యులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు.
 
 మీరు మా వైపు వచ్చినా రిజిస్టర్డ్ పార్టీ కాకపోవడంతో విప్ వర్తించదని, మీ పైనా చర్యలుండవంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అధికారం తమదేనని తమ వైపు వస్తే అన్ని విధాలా లాభం చేకూరుస్తామంటూ నానా విధాలా ప్రలోభ పెట్టారు. వైఎస్సార్‌సీపీ సభ్యులెవరూ అందుకు లొంగలేదు. తమకు పదవులు కట్టబెట్టిన పార్టీవైపే ఉంటామని, అధికారం అక్కరలేదంటూ తేల్చి చెప్పారు. ఇంతలో వైఎస్సార్‌సీపీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు లభించింది. తద్వారా విప్ అధికారం వచ్చింది.
 
 ఈ నేపథ్యంలో ఒక వేళ సభ్యులెవరైనా ప్రలోభాలకు లొంగి విప్‌ను ధిక్కరించిన పక్షంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 15 రోజుల్లోనే విప్‌ను ధిక్కరించిన సభ్యుడు పదవి కోల్పోక తప్పదు. ఈ విషయం టీడీపీ వారితోపాటు ఇటు వైఎస్సార్‌సీపీ సభ్యులకు తెలుసు. టీడీపీ ప్రలోభాలకు లొంగి పదవులు పోగొట్టుకునేందుకు వైఎస్సార్‌సీపీ సభ్యులు సిద్ధంగా లేరు.
 
 అయినా సరే టీడీపీ వారు మైండ్ గేమ్‌తో అటు జెడ్పీ, ఇటు కార్పొరేషన్లు మావే అంటూ విస్తృతంగా అసత్య ప్రచారం చేస్తున్నారు. మీ పార్టీ సభ్యులు కొందరు మావైపునకు వస్తున్నారు. మీరు కూడా రండి అంటూ గ్లోబల్ ప్రచారంతో ఊదరగొడుతున్నారు. వైఎస్సార్‌సీపీకి రెండు స్థానాల్లో స్పష్టమైన మెజార్టీ ఉంది. టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా జిల్లా పరిషత్, కార్పొరేషన్లు వైఎస్సార్‌సీపీ దక్కించుకోవడం ఖాయమన్నది పరిశీలకుల మాట. వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు నిర్వహించిన సమావేశాలు జిల్లాలోని నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్‌పై భరోసానిచ్చాయి.
 

మరిన్ని వార్తలు