ముంబయి నుంచి వచ్చినకూలీలకు వైద్యపరీక్షలు
వైరస్ సోకలేదని లేదని తేల్చిన డాక్టర్లు
అనంతపురం, కణేకల్లు: మండలంలోని గరుడచేడు నుంచి ముంబయికి వలస వెళ్లిన కూలీలు ఆదివారం తిరిగి రాగా... వారికి కోవిడ్ లక్షణాలున్నాయనే వదంతులు వ్యాపించడంతో ప్రజల్లో తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో వారిని పీహెచ్సీకి పిలిపించి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. గరుడచేడుకు చెందిన హరిజన కొల్లయ్య, హరిజన చెన్నమ్మ, హరిజన లక్ష్మి, హరిజన సునీత, హరిజన వన్నూరుస్వామి, హరిజన శిల్ప, వారి పిల్లలు ఇందు), యశ్వంత్ను వెంటబెట్టుకుని ఐదు నెలల క్రితం బతుకు తెరువు కోసం ముంబయికి వలస వెళ్లారు.
ఉగాది పండుగ నేపథ్యంలో వీరు చెన్నై ఎక్స్ప్రెస్ రైలులో ముంబయి నుంచి గుంతకల్లుకు చేరుకుని శనివారం రాత్రి గరుడచేడుకు వచ్చారు. వీరికి కోవిడ్ లక్షణాలున్నాయేమోనని ఆందోళన చెందిన స్థానికులు విషయాన్ని గ్రామ వలంటీర్లకు, వైఎస్సార్సీపీ నాయకులు ఆలేరి రాజగోపాల్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన విషయాన్ని వైద్యులకు తెలపగా.. వలస కూలీలకు డాక్టర్లు రమేష్నాయక్, విజయ్కుమార్, వైద్య సిబ్బంది నరసింహులు, మారుతీ వైద్యపరీక్షలు చేశారు. వారెవరికీ కోవిడ్ లక్షణాలు లేవని నిర్ధారించారు. అయినా 14 రోజులు వారు ఇంట్లోనే ఉండాలని సూచించారు. రోజు ఉదయం, సాయంకాలం వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.