ఎమ్మార్పీఎస్ పోరాటం వల్లే దళితులకు గుర్తింపు

21 Dec, 2013 00:34 IST|Sakshi

మహేశ్వరం, న్యూస్‌లైన్: గత కొన్నేళ్లుగా ఎమ్మార్పీఎస్ చేస్తున్న పోరాటం, ఉద్యమాల కారణంగానే రాష్ట్రంలో దళితులకు గుర్తింపు లభించిందని, తమ వల్లే పలువురు దళితులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కాగలిగారని  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.  జనవరి నెల మొదటి వారంలో  తాను కొత్త పార్టీ ప్రకటిస్తానని చెప్పారు. శుక్రవారం ఆయన మహేశ్వరంలో  కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... జనవరిలో తాను  పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఏబీసీడీ వర్గీకరణ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి 2014 ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం వర్గీకరణ బిల్లుపై ఉద్యమిస్తామని తెలిపారు.
 
 ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలితంగానే  ప్రతి మాదిగలో చైతన్యం వచ్చిందని అన్నారు. తెలంగాణ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఎమ్మార్పీఎస్ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో  రాష్ట్ర వికలాంగుల పోరాట సమితి అధ్యక్షుడు అందె రాంబాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు  వనం నర్సింహా మాదిగ,  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కళామండలి అధ్యక్షుడు ఎన్‌వై. ఆశోక్ మాదిగ,  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు వత్తుల రఘుపతి,  జిల్లా అధ్యక్షుడు రావుగళ్ల బాబు మాదిగ,  మాదిగ విద్యార్థి పెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కొండ్రు  ప్రవీణ్‌మాదిగ, నియోజకవర్గ ఇన్‌చార్జి కొంగరి నర్సింహా మాదిగ, మండల అధ్యక్షుడు బక్కని రవి మాదిగ, నాయకులు లక్ష్మణ్, ప్రశాంత్ మాదిగ, స్వామి మాదిగ,  వికలాంగులు,  ఉద్యోగులు, యువసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు