CM Jagan Review On Cyclone: తుపానుపై సీఎం జగన్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు

3 Dec, 2023 15:38 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు అధికారులతో సమీక్ష జరిపారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, పకడ్బందీగా సహాయక చర్యలు చేపట్టేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని, శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, తుపాను వల్ల విద్యుత్‌, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికిన వాటిని పునరుద్ధరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు.

తుపాను పరిస్థితులు, చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రేపు ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా మరోమారు సమీక్ష చేస్తానని ఆయన తెలిపారు. పొలాల్లో, కలాల్లో ఉన్న ధాన్యం తడిపోకుండా పౌరసరఫరాల శాఖకు చెందిన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

ధాన్యం తడిపిపోకుండా వెంటనే మిల్లులు లేదా భద్రతమైన ప్రాంతాలకు వాటిని తరలించే బాధ్యతను తీసుకోవాలని, తేమ లాంటి సాంకేతిక అంశాలను పక్కనపెట్టి రైతుల వద్దనున్న ధాన్యాన్ని వెంటనే ప్రొక్యూర్‌ చేయాలన్నారు. తుపాను కారణంగా భారీవర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జలవనరులశాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన సీఎం.. తుపాను అనంతరం యుద్ధప్రాతిపదికన ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.
చదవండి: ముంచుకొస్తున్న మిచాంగ్‌

మరిన్ని వార్తలు