-

ప్రియుడితో పెళ్లి చేస్తానని బాండ్‌ రాసి ఇవ్వండి!

6 Dec, 2019 08:25 IST|Sakshi
నేలపై పడిన యాసిడ్, తల్లి ప్రభావతి

సాక్షి, శ్రీకాకుళం : ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానని కుమార్తె పట్టుబట్టింది. వద్దని తల్లిదండ్రులు వారించారు. తాము తెచ్చిన సంబంధాన్నే చేసుకోవాలన్నారు. ఈ విషయంపై తల్లీకుమార్తెల మధ్య కొద్దిరోజులుగా తగాదా జరుగుతోంది. గురువారం మరోసారి తీవ్రస్థాయిలో ఇంట్లోనే వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన కుమార్తె ఇంట్లోని బాత్‌రూమ్‌లో వాడే యాసిడ్‌ బాటిల్‌తో తల్లి ముఖంపై కొట్టింది. ఈ ఘటన శ్రీకాకుళం పరిధిలోని ఏఎస్‌ఎన్‌ కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కాలనీలో నివసిస్తున్న రామప్పడు, ప్రభావతిల కుమార్తె జ్యోత్స్న వైజాగ్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదివింది. ఆ సమయంలో ఓ అబ్బాయిని ప్రేమించింది. ఇటివలే బీటెక్‌ పూర్తయింది. ఓ అబ్బాయిని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. దీనికి తల్లిదండ్రులు తిరస్కరించారు. ఇదే విషయంపై తల్లీకుమార్తె ప్రతి రోజూ తగాదా పడుతున్నారు.

ప్రేమించిన వ్యక్తితోనే వివాహం జరిపిస్తామని తల్లి ప్రభావతి చెప్పినప్పటికీ కుమార్తె జ్యోత్స్న.. తనకున్న తెలివి తేటలతో బాండ్‌ పేపర్‌పై ‘కోరుకున్న వాడితోనే పెళ్లి చేస్తామని’ రాసి ఇవ్వాలన్నది. ఈ విషయంలో తల్లికి కోపం రావడంతో ఆమె ససేమిరా అనేసింది. బాత్‌రూంలో ఉన్న యాసిడ్‌ బాటిల్‌ను తీసిన జ్యోత్స్న తల్లి ప్రభావతిపై విసిరికొట్టింది. వెంటనే ముఖంపై బొబ్బలు ఏర్పడ్డాయి. దుస్తులన్నీ కాలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న తండ్రి 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు. రెండో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తల్లీకుమార్తెల నుంచి వివరాలు సేకరించారు. రిమ్స్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. ఈ మేరకు విచారణ చేస్తున్నామని, తల్లీకుమార్తెలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని రెండో పట్టణ ఎస్‌ఐ ముకుందరావు తెలిపారు. 

మరిన్ని వార్తలు