నర్సాపూర్ నియోజకవర్గంలో జోరుగా అభివృద్ధిపనులు

31 Dec, 2013 23:57 IST|Sakshi

నర్సాపూర్, న్యూస్‌లైన్: స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి వి.సునీతాలక్ష్మారెడ్డి కృషి ఫలితంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఆమె మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం  నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ.18 వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. నియోజకవర్గంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు గాను సుమారు ఇరవై సబ్ స్టేషన్లతో పాటు పెద్దగొట్టిముక్ల, గోమారం గ్రామాల సమీపంలో సుమారు వెయ్యి కోట్లతో 400 కేవీ సబ్ స్టేషన్‌ను మంజూరు చేయించారు. అలాగే వెల్దుర్తి మండలంలోని హల్ది ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పునరుద్ధరణ కోసం రూ.8 కోట్ల 30 లక్షలు మంజూరు చేయించగా పనులు కొనసాగుతున్నాయి.

పంచాయతీ రోడ్ల అభివృద్ధికి రూ.45 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్ల కోసం రూ. 25 కోట్లు, చెక్‌డ్యాంలు, చెరువుల మరమ్మతుల కోసం రూ.40 కోట్లు మంజూరు చేయించారు. మంచి నీటి సమస్య పరిష్కరించేందుకు గాను  ఆర్‌డబ్ల్యూఎస్ కింద పైపులైన్లు, ఇతర నీటి సరఫరా కోసం 70 కోట్ల రూపాయలు, విద్యాభివృద్ధిలో భాగంగా  పాఠశాలలకు అదనపు గదులు, కొత్త భవనాల కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేయించగా పనులు కొనసాగుతున్నాయి.  పలు బ్రిడ్జిల నిర్మాణానికి గాను రూ. 33 కోట్లు మంజూరు చేయించారు. అలాగే గత నాలుగున్నర ఏళ్లలో సుమారు 15వేల ఇండ్లు శాశ్వత గృహ నిర్మాణ పథకం ద్వారా పేదలకు ఇళ్లు అర్హులకు 18వేల దీపం కనెక్షన్లు మంజూరు చేయించారు.

 బాధ్యతగా చేస్తున్నా మంత్రి : సునీతాలక్ష్మారెడ్డి
 నన్ను ప్రజలు విశ్వాసంతో మూడు సార్లు గెలిపించారు.  వారి సమస్యలను పరిష్కరిస్తాననే నమ్మకం ఉంది. అందుకే సుమారు 1800 కోట్ల రూపాయలతో పనులు చేయించా. పనులు కొనసాగుతున్నాయి. వారి నమ్మకాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నా. అంతకు ముందు నియోజకవర్గం ఎంతో వెనుకబడి ఉండేది. ప్రజల సమస్యలు పరిష్కరించడం నా బాధ్యత. నన్ను గెలిపించి నందుకు కృతజ్ఞతగా భావిస్తున్నా. అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా.

మరిన్ని వార్తలు