లంచం అడుగుతున్నారా .. కాల్ 1064

16 May, 2015 01:53 IST|Sakshi

 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసిన  ఏసీజీ
 గోప్యంగా ఫిర్యాదుదారుల వివరాలు
 తప్పు చేస్తే ఇంటిదొంగకైనా చర్యలు

 
 టోల్‌ఫ్రీ నంబర్‌పై అవగాహన కల్పిస్తాం  
 ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద టోల్‌ఫ్రీనెంబర్ 1064 పోస్టర్ అంటిస్తాం. అవగాహన కార్యక్రమాలు చేపడుతాం. బాధితులు ఎంత పెద్దవారిపైన అయినా టోల్‌ఫ్రీ నంబర్‌కు ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా వుంచుతాం.  ఏసీబీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఎసీబీ డీఎస్పీ నంబర్  9440446190, సీఐలు  9440446138, 9440808112 నంబర్లకు కాల్ చేయవచ్చు. 1064కు కాల్ చేస్తే మీ ప్రతి ఒక్క మాటను రికార్డు అవుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లంచగొండి ఉద్యోగి భరతం పడుతాం.        
 - శంకర్‌రెడ్డి, ఏసీబీ డీఎస్పీ, తిరుపతి
 
 తిరుపతి క్రైం: ప్రభుత్వ కార్యాలయాల్లో మీపని చేసిపెట్టేందుకు  లంచం అడుగుతున్నారా? దీనిపై స్థానిక  ఏసీబీ  అధికారులకు ఫిర్యాదు చేసినా  పట్టించుకోవడం లేదా? ఆదాయానికి మించి ఆస్తులున్న  అధికారుల వివరాలు మీవద్ద  ఉన్నాయా ? వీటన్నింటిపై  ఫిర్యాదు చేసేందు కు  అవినీతి నిరోధక శాఖ  హైదరాబాద్ కేంద్రంగా టోల్ ఫ్రీ నంబర్ 1064 ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ అధికారులు ఫిర్యాదు అందుకున్న వెంటనే కిందిస్థాయి సిబ్బందికి  సమాచారం  అందించి చర్యలు  తీసుకుంటారు. ఫిర్యాదు దారుల వివరాలు అత్యంత గోప్యంగా వుంచుతారు.  
 
 అవినీతిని అరికట్టాల్సిందే ...
 ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  తీసుకోవాలి. పథకాల ఎంపికలో దళారులు, రాజకీయ జోక్యం అరికట్టాలి. ప్రజల్లో కూడా మార్పు రావాలి.ఏ అధికారిఅయినా డిమాండ్ చేస్తే  నిలదీయాలి. లేదా ఏసీబీని ఆశ్రయించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక నిఘా  ఉంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ప్రజలు కూడా  ఆదాయానికి మించి ఆస్తులున్న అధికారుల వివరాలను  పూర్తిస్థాయిలో అందించాలి.ఏసీబీ, విజిలెన్స్ శాఖల్లో  అవసరమైన  సిబ్బందిని  నియమిస్తే  నిరంతరం తనిఖీలు చేసే అవకాశం ఉంది.
 
 అవినీతి ఆరోపణలు ఉన్న విభాగాలివే..
 పౌరసరఫరాలశాఖలో కొందరు అధికారులు మా మూళ్ల మత్తులో జోగుతున్నారు. తూనికలు, కొలత ల్లో  మోసం జరుగుతున్నా  పట్టించుకునే ఉన్నతాధికారులే కరువయ్యారు. చౌక దుకాణాల్లో వినియోగదారుడికి సరుకులు సక్రమంగా అందడంలేదు.  
 రెవెన్యూ విభాగంలో ఆర్డీవో కార్యాలయం మొదలు  పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు, కుల, ఆదా య ధ్రువీకరణపత్రాల్లో అవినీతి పేరుకుపోయింది. ఈ విభాగాల్లో  ఎక్కువ మంది  ఏసీబీకి పట్టుపడడం గమనార్హం. ప్రజలతో పూర్తిగా సత్సంబంధాలు కలిగే ఈ విభాగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి.
 సంక్షేమవసతి గృహాల్లో కొంతమంది చేతివాటాన్ని  ప్రదర్శిస్తున్నారు. పిల్లలకు ఇచ్చే మెనూలోనూ నిబంధనలు పాటించకుండా జేబులు నింపుకుంటున్నారు.
 
 పోలీసు శాఖలో కూడా అవినీతి పెచ్చుమీరిపోయింది. హోంగార్డు నుంచి అధికారి వరకు లంచం లేనిదే ఏపనీ చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు ఈ విభాగంపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచకపోవడంతో అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. ప్రజలు కూడా ఈవిభాగంపై ఫిర్యాదు  చేయడంలేదు. పురపాలక శాఖలో కూడా అవినీతి పెచ్చు మీరిపోయింది. కొళాయి  పన్ను నుంచి  భవన నిర్మాణానికి  అనుమతి పత్రాలు  మంజూరు చేసేంత వరకు  మామూళ్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు  వినిపిస్తున్నాయి.
 
 మూడేళ్లలో ఏసీబీ కేసులివే..
 2012 ఆదాయానికి  మించిన ఆస్తుల  కేసులు ఒకటి, తదితర దాడుల కేసులు 4, ట్రాపింగ్ కేసులు తొమ్మిది నమోదయ్యాయి.2013లో ఆదాయానికి  మించిన ఆస్తుల కేసులు, ట్రాపింగ్ కేసులు 13, ఇతర రత్రా దాడుల్లో 5 కేసులు నమోదయ్యాయి. 2014లో ఆదాయానికి మించిన కేసు  ఒకటి, ట్రాపింగ్ కేసులు 19, ఇతరత్రా  దాడుల్లో 10 కేసులు నమోదయ్యాయి.
 

మరిన్ని వార్తలు