పార్టీ ఫిరాయిస్తే.. అనర్హత వేటే

1 Jul, 2014 02:39 IST|Sakshi
పార్టీ ఫిరాయిస్తే.. అనర్హత వేటే

సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. వేరొక పార్టీలోకి మారాలనుకున్న జెడ్పీటీసీ సభ్యులు.. ఎంపీటీసీ సభ్యులు.. కౌన్సిలర్లూ.. తస్మాత్ జాగ్రత్త. ఎన్నికైన పార్టీ ఆదేశాలు, విప్‌ను ధిక్కరించే వారిపై తక్షణమే అనర్హత వేటు పడటం ఖాయమైంది. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు 2003లో పంచాయతీరాజ్ చట్టం చేసిన సవరణలతో స్థానిక సంస్థల ప్రతినిధులు పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే ఆ మరుక్షణమే వారిపై అనర్హత వేటు తప్పదని చట్టాలు చెపుతున్నాయి.
 
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు స్థానిక సంస్థలను కైవసం చేసుకునేందుకు రకరకాల అడ్డదారులు తొక్కుతున్న విషయం విదితమే. ఈ పరిస్థితుల్లో పార్టీ మారేవారికి చట్టంలోని పకడ్బందీ నిబంధనలు షాక్ కొట్టించే విధంగా ఉన్నాయని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. అనర్హత వేటుతో అప్రతిష్టపాలుకావటంతోపాటు రాజకీయ భవిష్యత్ కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో ఇలా పార్టీలు మారిన వారు తెరమరుగైన సంఘటనలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో పార్టీ సిద్ధాంతాలను అనుసరించి ప్రజాభిప్రాయం మేరకు నడచుకున్న వారే.. ఆ తరువాత కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నత స్థాయిలోకి వెళ్లగలిగారు.
 
స్వల్పకాలిక ప్రయోజనాల కోసం పార్టీలు మారితే ఆ తరువాత దీర్ఘకాలంగా రాజకీయంగా నష్టపోక తప్పదు. అయితే జిల్లాలో జెడ్పీ చైర్మన్ పీఠం కైవసం చేసుకోవ టానికి అధికార పార్టీ నేతలు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులను అనేక రకాల ప్రలోభాలకు గురిచేస్తున్నారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయటంతో నేతలు పునరాలోచనలో పడ్డారు. ప్రజల తీర్పును, పార్టీ నిర్ణయాన్ని భవిష్యత్‌ను పణంగా పెట్టడం పలువురు నేతలకు మింగుడుపడటం లేదు. పార్టీని ధిక్కరిస్తే వెంటనే వేటుపడటం, ఆపై ప్రజలు ఛీకొట్టటం ఖాయమని భావిస్తున్నారు. బంగారు భవిష్యత్‌ను వదులుకోవటమెందుకు? అన్న ఆలోచనలో పడ్డారు. అయినా కొన్నిచోట్ల కొంత మంది అమాయకులను ఆసరా చేసుకుని అధికారపక్షం వారు చట్టాలను వక్రీకరిస్తున్నారు.

వారెన్ని చెప్పినా చట్టం పకడ్బందీగా ఉన్నందున అనర్హత వేటు తప్పదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆ పార్టీ జారీ చేసిన విప్‌కు అనుకూలంగా ఓటువేయాలే తప్ప ధిక్కరిస్తే అనర్హత వేటుకు గురవుతారని తెలియజేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రత్యేకంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు సోమవారం అధికారికంగా విప్ జారీ చేశారు.
 
పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చేపుతోందంటే....
1985 రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సందర్భంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి, దాన్ని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ల్లో చేర్చారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అటు తరువాత  బీజేపీ కేంద్రంలో ఉన్న సమయంలో 2003లో ఈ చట్టానికి కొన్ని సవరణలు చేశారు. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు ఎవరైనా తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు అతనికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది.
 
తను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయపార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవటానికి, ఆ పార్టీకి రాజీనామా సమర్పించటానికి తేడా ఉందని, ఈ రెండు పదాలు కూడా సమానార్థకాలు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తన పార్టీకి రాజీనామా చేయనప్పటికి, స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవచ్చని తెలిపింది. అదే విధంగా పార్టీ ఆదేశాలకు భిన్నంగా ఏదైనా అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు అందులో పాల్గొని ఓటువేయటం, లేదా ఓటింగ్‌కు గైర్హాజరు కావడం చేసినప్పుడు కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది.
 
ఒకవేళ సదరు రాజకీయ పార్టీ తమ సభ్యుడి ధిక్కారాన్ని 15 రోజుల లోపు ఖండించని పక్షంలో అతనికి ఫిరాయింపుల చట్టం వర్తించదు. అంతేకాకుండా ఏ పార్టీ టికెట్ మీద అయితే ఓ సభ్యుడు గెలిచారో, ఆ వ్యక్తి ప్రతిపక్ష నేతను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను రాతపూర్వకంగా కోరే ఆ వ్యక్తి తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. 2003లో తీసుకొచ్చిన చట్ట సవరణ ప్రకారం పార్టీలోని మూడింట రెండు వంతుల మంది సభ్యులు వేరే పార్టీకి వెళ్లిన సందర్భాన్ని ఫిరాయింపుగా పరిగణించటానికి వీల్లేదు. చట్టసభలకు ఎన్నికైన వెంటనే ఎవరైనా స్వతంత్ర అభ్యర్థి ఇతర రాజకీయ పార్టీలో చేరితే అతనికీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది.

మరిన్ని వార్తలు