మైనర్లకు ‘ఉపాధి’ జాబ్‌ కార్డులు!

28 Jul, 2018 07:00 IST|Sakshi

జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

కేఎన్‌ పురంలో ఏపీడీ విచారణ

పశ్చిమగోదావరి, దెందులూరు : కండ్రిగ నరసింహపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలపై జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌కు గ్రామస్తులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం కేఎన్‌.పురం కమ్యూనిటీ హాలులో ఉపాధి హామీ పథకం ఏపీడీ వరప్రసాద్‌ విచారణ చేశారు. కలెక్టర్‌ భాస్కర్‌కు ‘మీ కోసం’ కార్యక్రమంలో గ్రామస్తులు చేసిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. 18 సంవత్సరాలు నిండని మైనర్‌లకు ఉపాధి కూలీలుగా గుర్తింపు కార్డులు (జాబ్‌ కార్డులు), ఉద్యోగులకు మస్తర్‌లు, పనికి వెళ్లని వారికి మస్తర్‌లు వేసి పేదలకు అందాల్సిన ఉపాధి హామీ నగదు అనర్హులకు, పనిచేయని వారికి ఇస్తున్నారని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్‌ ఉపాధి హామీ ఏపీడీ వరప్రసాద్‌ను విచారణ నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం వరప్రసాద్, ఎంపీడీఓ ఆర్‌. శ్రీదేవి, ఈసీ శ్రీనివాస్‌లు విచారణ నిర్వహించారు. అయితే విచారణపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వారు లేకుండా విచారణ చేశారని, వారు ఉంటే విచారణలో మరిన్ని ఆధారాలు, అక్రమాలు వెలుగులోకి వచ్చేవని తెలిపారు. నోటీసు లేకుండా ఏకపక్షంగా విచారణ జరిగినట్టే భావిస్తున్నామని చెప్పారు. మైనర్‌లకు జాబ్‌కార్డులు ఇచ్చి, ఉద్యోగస్తులు మస్తర్‌లు వేస్తూ పేదలకు అందాల్సిన ప్రభుత్వ సొమ్మును దిగమింగుతున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు